Page Loader
Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్‌ 
స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్‌

Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని పంచేలా, మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించటానికి, అవయవ లోపం తమకే కాని తమ లక్ష్యానికి కాదన్న సంకల్పాన్ని ప్రపంచానికి చాటేలా, పారిస్‌ వేదికగా మరో విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. పారిస్‌ వేదికగా పారా ఒలింపిక్స్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మిరుమిట్లు కలిగించే కాంతుల మధ్య ఆటగాళ్ల పరేడ్‌ నిర్వహించి, పారిస్‌ పారా ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యిందని అధికారికంగా ప్రకటించారు. నాలుగు వేలమందికి పైగా అథ్లెట్లు, 22 క్రీడాంశాలలో తలపడే ఈ 11 రోజుల క్రీడా సంబరాలకు తెరలేచింది. ఈసారి 25 పతకాల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బృందానికి జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాదవ్‌ నేతృత్వం వహించారు.

వివరాలు 

ఆకర్షణగా నిలిచిన హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌ 

వీరిద్దరూ భారత జాతీయ పతాకంతో ముందంజలో ఉన్నారు.పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలను తలదన్నట్లుగా పారాఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టేడియం బయటే జరిపిన ఈ వేడుకల్లో,దివ్యాంగ కళాకారులు చేసిన ప్రదర్శన అబ్బురపరిచింది. గ్యాలరీలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి,ఆకాశంలో సాగిన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌ కూడా క్రీడా జ్యోతిని చేబూని పారిస్‌ వీధుల్లో సందడి చేశాడు.జాకీచాన్‌ రాకతో పారా ఒలింపిక్స్‌ కొత్త శోభను సంతరించుకుందని చెప్పవచ్చు. పారా ఒలింపిక్స్‌లో దివ్యాంగ అథ్లెట్ల పరేడ్‌ను చాంప్స్‌ ఎలీసీస్‌ నుంచి ప్లేస్‌ డి లా కాంకార్డ్‌ వరకూ వైభవంగా నిర్వహించారు. ఫ్రెంచ్‌ పారా స్విమ్మర్‌ థియో క్యూరిన్‌ కారులో ప్రారంభోత్సవ వేదిక డిలా కాంకార్ట్‌కు వస్తూ పారా అథ్లెట్లకు స్వాగతం పలికాడు.

వివరాలు 

భారత పతాక ధారులుగా సుమిత్‌ అంటిల్‌,భాగ్యశ్రీ జాదవ్‌

భారీగా హాజరైన ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ , ఇంటర్నేషనల్‌ పారాలింపిక్‌ కమిటీ చీఫ్‌ ఆండ్రూ పార్సన్స్‌తో కరచాలనం చేశారు. ఇప్పటికే ఈ పారాలింపిక్స్‌ కోసం 20లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి.కెనడాకు చెందిన ప్రఖ్యాత పియానిస్ట్‌ చిల్లీ గొంజాలెస్‌ పియానో వాయిస్తుండగా,140మంది డ్యాన్సర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పారాలింపిక్స్‌ మస్కట్‌ 'పిర్ఘే'స్టేజ్‌పైనే వస్తూ అతిథులు,ప్రతినిధులు,అథ్లెట్లకు స్వాగతం పలికింది. అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌ ప్రారంభమైంది.తొలుత అఫ్ఘానిస్థాన్‌ పారా అథ్లెట్లు మార్చ్‌ ఫాస్ట్‌ చేశారు. భారతదేశం తరపున,జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌,షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాదవ్‌ పతాక ధారులుగా ముందుండగా,బృందం సభ్యులు వారిని అనుసరించారు. తెల్ల కుర్తా,పైజమాతో పాటు ఓవర్‌ కోట్‌,మెడలో త్రివర్ణపతాక రంగులతో కూడిన కండువాను ధరించి భారత అథ్లెట్లు పరేడ్‌లో మెరిసిపోయారు.