
ENG vs IND: రిషబ్ పంత్ ఫామ్ సూపర్బ్.. రాహుల్ నిలకడగా కొనసాగుతాడు : మంజ్రేకర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్తో అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా మొదటి టెస్ట్ ముగిసింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమిని చవిచూసినా, టాప్ ఆర్డర్ నుంచి వచ్చిన అద్భుత ప్రదర్శన మాత్రం బలాన్నిచ్చింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ శతకాలు నమోదు చేయగా, రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు బాదడం విశేషం. పంత్ ఫామ్ను కొనసాగిస్తాడని, మరిన్ని రన్స్ సాధిస్తాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు.
Details
ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేయడం చిన్న విషయం కాదు
''రిషబ్ పంత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఒకే టెస్ట్లో రెండు సెంచరీలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అతడిలో పరుగుల తహతహ ఉందని కనిపిస్తోంది. ఇది రెండో టెస్ట్లోనూ కొనసాగుతుంది. అలాగే కేఎల్ రాహుల్ తొలి టెస్ట్లో సెంచరీ చేశాడు. అతడికి ఇది మొదటిది కాదు, ఇక ఆగిపోడు. మరిన్ని కీలక ఇన్నింగ్స్లు ఆడతాడని నాకు నమ్మకముందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇక జులై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో రెండో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్కు వర్క్లోడ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అదే సమయంలో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్కు టెస్ట్ క్రికెట్లో తిరిగిరావాలన్న అవకాశమిది. అతను ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.