
RCB : అమ్మకానికి ఆర్సీబీ?.. టైటిల్ గెలవగానే ఫ్రాంచైజీ షాకింగ్ డెసిషన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి తమ తొలి ట్రోఫీని సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులు ఆనందోత్సాహాల్లో ఉన్న తరుణంలో, ఆ జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మే దిశగా యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
జట్టును పూర్తిగా లేదా భాగంగా విక్రయించే అవకాశాలున్నాయని సమాచారం.
ప్రస్తుతం భారత్లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనే సంస్థ, దాని తల్లిసంస్థ అయిన డియాజియో పీఎల్సీ ద్వారా ఆర్సీబీని నిర్వహిస్తోంది.
వివరాలు
ఆర్సీబీ ఫ్రాంచైజీని మొదట విజయ్ మాల్యా కొనుగోలు
ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ,ఈ ఫ్రాంచైజీ విలువ సుమారు 2బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2008లో ప్రారంభమైన ఐపీఎల్లో,ఆర్సీబీ ఫ్రాంచైజీని మొదట విజయ్ మాల్యా తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ద్వారా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
భారత మద్యం వ్యాపారంలో పేరొందిన వ్యక్తిగా గుర్తింపు పొందిన మాల్యా,ఆ తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోయారు.
దీంతో యునైటెడ్ స్పిరిట్స్ను డియాజియో సంస్థ కొనుగోలు చేయగా,ఆర్సీబీ కూడా వారి అధీనంలోకి వెళ్లింది.
ఇప్పుడు అమ్మకానికి సంభావ్యత ఉందనే వార్తల నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ షేర్లకు మంగళవారం ఉదయం మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగింది.
స్టాక్ విలువలు 3.3శాతం వరకు ఎగిసిపోయాయి.
వివరాలు
బీసీసీఐకి ఫ్రాంచైజీ విక్రయంపై విజ్ఞప్తులు
ఐపీఎల్లో ఇతర 9 జట్లతో పోల్చితే ఆర్సీబీకి ప్రత్యేకత ఉంది. 18 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా, ఈ జట్టుకు ఉన్న అభిమానుల సంఖ్య ఇతర జట్లతో పోల్చితే విస్తృతంగా ఉంటుంది.
అయినప్పటికీ, జట్టు ప్రదర్శనపై నిరంతరం విమర్శలు ఎదురవుతున్నాయి. యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు అభిమానుల నుంచే కాకుండా మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచీ వచ్చాయి.
ఆటగాళ్ల ఎంపికలో చురుకుతనంలో లోపాలు ఉన్నాయని, జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో యాజమాన్యం విఫలమవుతోందన్న ఆరోపణలు వినిపించాయి.
వివరాలు
బీసీసీఐకి లేఖ రాసిన భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి
ఈ నేపథ్యంలో గతేడాది భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి, బీసీసీఐకి లేఖ రాసి ఆర్సీబీని కొత్త యాజమాన్యానికి అప్పగించాలని కోరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు టైటిల్ గెలిచిన వెంటనే అమ్మకపు ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, డియాజియో ఇక ఆ జట్టు నిర్వహణ భారం మోయలేకనే ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.