Page Loader
CSK vs SRH: చెపాక్‌లో చెన్నైదే పైచేయి.. సన్‌రైజర్స్‌కు గట్టి పరీక్షే: సంజయ్ బంగర్‌
చెపాక్‌లో చెన్నైదే పైచేయి.. సన్‌రైజర్స్‌కు గట్టి పరీక్షే: సంజయ్ బంగర్‌

CSK vs SRH: చెపాక్‌లో చెన్నైదే పైచేయి.. సన్‌రైజర్స్‌కు గట్టి పరీక్షే: సంజయ్ బంగర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఇవాళ చెపాక్ స్టేడియంలో పరస్పరం తలపడనున్నాయి. సొంత మైదానంలో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK), సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ (SRH) ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఒక్కొక్కటీ రెండు విజయాలే సాధించాయి. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై విజయాన్ని సాధిస్తుందని మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. తన అభిప్రాయానికి కారణాలు కూడా వివరించాడు.

వివరాలు 

సన్‌రైజర్స్ ఆటలో స్థిరత్వం కనిపించటం లేదు: బంగర్ 

''ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. ముఖ్యంగా చెన్నై జట్టులో స్పిన్నర్లు బలంగా ఉన్నారు. చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో ఇది కీలకంగా మారనుంది. గత మ్యాచుల్లో జరిగిన పరాజయాలను మర్చిపోయి జట్టు ముందుకుసాగాలి. యువ క్రికెటర్ల ప్రతిభపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. మరోవైపు సన్‌రైజర్స్ ఆటలో స్థిరత్వం కనిపించటం లేదు. జట్టులో ధైర్యంగా ఆడే ఆటగాళ్లు ఉన్నా, వాళ్లు విజయాల్లో కీలకంగా నిలవలేకపోవడం వల్లే జట్టు దిగువ స్థానంలో నిలిచింది,'' అని బంగర్ విశ్లేషించాడు.

వివరాలు 

డేవాల్డ్ బ్రెవిస్ ఆడటంపై ఫ్లెమింగ్‌

ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డేవాల్డ్ బ్రెవిస్‌ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటికే లీగ్ దశ సగానికి పైగా పూర్తవుతోంది. మరి సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడికి చోటు దక్కుతుందా? అన్నది సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ - ''బ్రెవిస్‌ కూడా మా ఆప్షన్లలో ఉన్న ఆటగాడే. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే తపన మా దృష్టిలో ఉంది. అతడు జట్టులోకి వచ్చినప్పుడు అవసరమైన బలాన్ని అందిస్తాడనే నమ్మకం ఉంది. మ్యాచ్‌కు ముందు తుది నిర్ణయం తీసుకుంటాం,'' అని స్పష్టం చేశాడు.

వివరాలు 

ధోనీకిది 400వ టీ20 మ్యాచ్‌ 

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడబోతున్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఘనతను సాధించిన 24వ ఆటగాడిగా ధోనీ నిలవబోతుండగా, భారత ఆటగాళ్లలో మాత్రం నాలుగో వ్యక్తిగా ఈ ఘనతను అందుకోనున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ (456 మ్యాచ్‌లు), దినేశ్ కార్తిక్‌ (412 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (408 మ్యాచ్‌లు) ఈ మైలురాయిని అధిగమించారు. ధోనీ ఇప్పటివరకు 399 టీ20 మ్యాచ్‌ల్లో 7,566 పరుగులు చేశారు. ఈ రికార్డులో 28 అర్ధశతకాలు ఉన్నాయి.