టీమిండియా ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. చేతికర్ర లేకుండా మెట్లెక్కేసిన పంత్!
రోడ్డు ప్రమాదంలో గాయపడి భారత జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరు నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మొన్నటి వరకూ ఊతకర్ర సాయంతో నడిచిన పంత్ ఇప్పుడు ఎవరి సాయం లేకుండా నడవడం మొదలుపెట్టాడు. తన హెల్త్ అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ద్వారా పంచుకొనే పంత్ తాజాగా మరో వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో పంత్ ఎవరి సాయం లేకుండా మెట్లు ఎక్కుతుండడం విశేషం. మొదట్లో మెట్లు ఎక్కే క్రమంలో కాస్త ఇబ్బంది గురైన పంత్ తర్వాత ఈజీగా ముందుకెళ్లాడు.
త్వరలో మైదానంలోకి దిగనున్న పంత్!
రిషబ్ పంత్ ఆ వీడియోకు నాట్ బ్యాడ్ యార్ రిషబ్, చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయంటూ అతను క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వీడియోను చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంత్ వేగంగా కోలుకుంటున్నాడని, త్వరలోనే మైదానంలో దిగుతాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024 లోపల రిషబ్ పంత్ పూర్తిగా కోలుకొనే అవకాశాలు ఉన్నట్లు కన్పిస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను కోలుకొని జట్టులోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా పంత్ గాయం కారణంగా గతేడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ కు పంత్ దూరమైన విషయం తెలిసిందే.