Page Loader
India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో రికార్డు
93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో రికార్డు

India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. లీడ్స్ టెస్ట్‌లో రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

లీడ్స్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 93 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు బ్యాట్స్‌మెన్లు ఒకే మ్యాచ్‌లో ఐదు శతకాలతో రాణించడం అరుదైన ఘనత. టెస్ట్‌ చరిత్రలో మొత్తం ఆరుసార్లు మాత్రమే ఇలాంటి రికార్డు నమోదయింది. విదేశీ గడ్డపై ఇలా ఐదు శతకాలు సాధించిన రెండో జట్టుగా భారత్‌ నిలిచింది. లీడ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) శతకాలు బాదడంతో భారత్‌ 471 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 465 పరుగులకే ఆలౌట్‌ అయింది.

Details

ఐదు వికెట్లు తీసిన బుమ్రా

దీంతో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ ఆధారంగా కేవలం 6 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓల్లీ పోప్‌ (106), బెన్‌ డకెట్‌ (62), హ్యారీ బ్రూక్‌ (99), జేమీ స్మిత్‌ (40), క్రిస్‌ వోక్స్‌ (38) మంచి ప్రదర్శన చేసి భారీ స్కోరు నమోదు చేశారు. భారత్‌ తరపున మొదటి ఇన్నింగ్స్‌ బౌలింగ్‌లో బుమ్రా (5/83), ప్రసిద్ధ్‌ కృష్ణ (3/128) అద్భుతం చేశారు. తరువాత రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్‌ (137), రిషబ్‌ పంత్‌ (118) శతకాలతో భారత్‌ మరోసారి రాణించింది.

Details

రెండు శతకాలు చేసిన తొలి వికెట్ కీపర్ గా పంత్ రికార్డు

ముఖ్యంగా రిషబ్‌ పంత్‌ ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు శతకాలు చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా చరిత్రకెక్కాడు. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ చివరి రోజు ఇంగ్లాండ్‌ గెలవాలంటే 350 పరుగులు చేయాలి, టీమిండియా విజయం సాధించాలంటే 10 వికెట్లు తీయాలి.