
Telangana sports policy: ఒలింపిక్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ రివార్డ్స్.. స్వర్ణానికి రూ. 6 కోట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఒలింపిక్స్, పారాలింపిక్స్లలో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. రజత పతకానికి రూ. 4 కోట్లు, కాంస్యానికి రూ. 2.5 కోట్లు అందజేయనుంది. అలాగే, విశ్వక్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు రూ. 15 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్రీడా విధానం (టీఎస్పీ)లో పొందుపరిచింది. సోమవారం నూతన టీఎస్పీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా క్రీడా అభివృద్ధిని పటిష్టం చేయడానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో 'యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్-స్పోర్ట్స్ యూనివర్సిటీ' (వైఐపీఈఎస్యూ)ని స్థాపించనుంది.
Details
ప్రపంచ స్థాయి నిపుణులను తయారుచేయడమే లక్ష్యం
ఈ విశ్వవిద్యాలయం క్రీడా రంగంలో ప్రపంచస్థాయి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్, యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్, యూత్ కామన్వెల్త్, ఆసియా క్రీడలు, యూత్ ఆసియా క్రీడలు, ప్రత్యేక ఒలింపిక్స్, డెఫ్లింపిక్స్లలో విజేతలకు భారీ ప్రోత్సాహకాలను అందజేయనుంది. క్రీడాకారులు, కోచ్ల ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం, భద్రత అందించడమే కాకుండా 'లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్' (ఎల్టీఏడీ)ని అమలు చేయనుంది. కీలక క్రీడలకు ప్రత్యేక కేంద్రాలుగా 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే సీఎం కప్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, మద్దతును అందించనుంది.
Details
సీఎం కప్తోపాటు గ్రామీణ స్థాయిలోనూ క్రీడా పోటీలు
క్రీడాకారులకు, సిబ్బందికి వైద్య సహాయం, మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్తోపాటు గ్రామీణ స్థాయిలోనూ క్రీడా పోటీలను నిర్వహించారు. సీఎం కప్లో రాష్ట్రస్థాయి ప్రతిభావంతులకూ స్పోర్ట్స్ కోటా ద్వారా రిజర్వేషన్లు కల్పించనుంది. అంతేకాకుండా, క్రీడల్లో సత్తా చాటే అథ్లెట్లు, కోచ్లు, విలేకరులు, పాఠశాలలు, కార్పొరేట్ భాగస్వాములను ప్రోత్సహించడం కోసం వార్షిక అవార్డులను ప్రదానం చేయనుంది.