Page Loader
RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 
ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం

RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. జట్టులోని ఇంగ్లండ్ క్రికెటర్ జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్‌ను ఆర్సీబీ యాజమాన్యం జట్టులో తీసుకుంది. భారతదేశం-పాకిస్థాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఐపీఎల్ షెడ్యూల్ ఒక వారం వాయిదా పడిన తర్వాత పునఃప్రారంభం సమయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ షెడ్యూల్ మార్పులు ఇప్పుడు ప్లేఆఫ్స్ దశలో ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి.

వివరాలు 

మే 29 నుంచి ఇంగ్లండ్,వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్

మే 29 నుంచి ఇంగ్లండ్,వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుండటంతో,జాకబ్ బెతెల్ తన జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అందువలన అతను ఈ సీజన్‌లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న లీగ్ మ్యాచ్ బెతెల్‌కు ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌గా ఉండనుంది. ఆ తరువాత,మే 24న అతను స్వదేశానికి బయలుదేరి ఇంగ్లండ్ జట్టుతో కలవనున్నాడు. జాకబ్ బెతెల్ స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. సీఫెర్ట్‌కు ఈ సీజన్‌కు రూ. 2 కోట్లు జీతంగా చెల్లించనున్నారు. ఈ ఒప్పందం మే 24నుంచి అమల్లోకి వస్తుంది. టిమ్ సీఫెర్ట్ ఇప్పటి వరకు 66 టీ20 మ్యాచ్‌లు ఆడి, 1,540 పరుగులు సాధించాడు.

వివరాలు 

జోస్ బట్లర్ కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు

గతంలో 2022 ఐపీఎల్ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది. మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్సీబీ చివరి లీగ్ మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్ ఆర్సీబీ తరఫున పాల్గొనవచ్చు. ఈ పరిణామం ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇటీవల పాకిస్థాన్‌తో వైట్ బాల్ క్రికెట్‌లో సీఫెర్ట్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు)ప్రభావం ఆర్సీబీపై మాత్రమే కాకుండా మరో ప్రఖ్యాత జట్టుపై కూడా పడింది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు.