Page Loader
Neeraj Chopra: దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా
దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా

Neeraj Chopra: దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కొత్త డైమండ్ లీగ్ సీజన్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ శుక్రవారం దోహాలో జరుగనున్న డైమండ్ లీగ్ పోటీలో అతను పాల్గొనబోతున్నాడు. ఈ పోటీలో తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవడం అతని లక్ష్యం. ఈసారి పోటీలో నీరజ్‌కు కఠినమైన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గ్రెనెడా ఆటగాడు అండర్సన్ పీటర్స్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వాద్లిచ్, జర్మనీకి చెందిన జులియన్ వెబర్‌లు అతనికి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇదిలా ఉండగా,పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు.

వివరాలు 

ట్రాక్ ఈవెంట్లలోనూ భారత ఆటగాళ్లు

ఇదే సమయంలో ఆసియా గేమ్స్‌లో రజత పతకాన్ని గెలిచిన భారత జావెలిన్‌ త్రోర్ కిశోర్ జెనా ఈ దోహా టోర్నీలో బరిలో ఉన్నాడు. గత సీజన్‌లో 90 మీటర్ల దూరం విసిరే లక్ష్యాన్ని నీరజ్ చేరుకోలేకపోయాడు.ఈ సీజన్‌లో మాత్రం అతను ఆ మైలురాయిని అందుకుంటాడా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. కేవలం జావెలిన్‌ మాత్రమే కాకుండా,ఇతర ట్రాక్ ఈవెంట్లలోనూ భారత ఆటగాళ్లు పోటీలో పాల్గొంటున్నారు. పురుషుల 5000మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్,మహిళల 3000మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ చౌదరి పాల్గొంటున్నారు. 5000మీటర్ల ఈవెంట్‌లో జాతీయ రికార్డు దారుడైన గుల్వీర్ సింగ్‌కి ఇది డైమండ్ లీగ్‌లో తొలి అవకాశం కావడం విశేషం. మరోవైపు,పారుల్ చౌదరి గత సంవత్సరం యూజీన్ డైమండ్ లీగ్‌లో పాల్గొనడం గమనార్హం.

వివరాలు 

అర్షద్‌తో నాకు అంతగా స్నేహం లేదు: నీరజ్ చోప్రా  

పాకిస్థాన్‌కు చెందిన జావెలిన్ త్రోర్ అర్షద్ నదీమ్‌తో తనకు అంతగా సన్నిహిత సంబంధం లేదని నీరజ్ చోప్రా స్పష్టం చేశాడు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో,అర్షద్‌తో అతని సంబంధాలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆయన వివరణ ఇచ్చాడు. ''అర్షద్‌తో నాకు బలమైన స్నేహం లేదు.భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఇలాంటి స్నేహం కొనసాగుతుందో లేదో చెప్పలేను. ఒక అథ్లెట్‌గా నేను ప్రపంచంలోని ఇతర అథ్లెట్లతో అనుబంధాన్ని పెంపొందించుకోవాలనుకుంటా.ఎవరైనా గౌరవంగా నాతో మెలిగితే,నేనూ గౌరవంతోనే స్పందిస్తాను,''అని నీరజ్ చెప్పాడు. ఇందులో భాగంగా,తన ఆధ్వర్యంలో భారత్‌లో జరిగే ఎన్‌సీ క్లాసిక్ ఈవెంట్‌కు అర్షద్ నదీమ్‌ను ఆహ్వానించినట్టు తెలిపాడు. అయితే,పహల్గాం ఉగ్రదాడి తర్వాత అర్షద్‌ను ఆహ్వానించిన నేపథ్యంలో,నీరజ్‌ చోప్రాపై కొందరు తీవ్ర విమర్శలు చేశారు.