ఇండియన్ కాన్సులేట్ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ (కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా)పై జరిగిన దాడిని యూఎస్ ఉభయ చట్టసభలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేర చర్యలకు పాల్పడ్డ నిందితులపై వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికాలో భారతదేశం రాయబారి తరణజీత్ సంధూపై ఖలిస్థానీ తీవ్రవాదులు మాట్లాడుతున్న తీరుని ఆయా సభ్యులు తప్పుబట్టారు. ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్ర్యం హక్కులు ఉంటాయని, అయితే అది హింసను ప్రోత్సాహించేందుకు ఇచ్చిన లైసెన్స్ కాదని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు చురకలు అంటించారు. ఇలాంటి దాడులు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇదో నీచమైన చర్య అని అన్నారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికన్ కాంగ్రెస్ డిమాండ్
భారత రాయబారి కార్యాలయానికి నిప్పుపెట్టడం పట్ల భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు విస్మయానికి లోనయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై 2న కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఇండియన్ కాన్సులేట్ కార్యాలయ్యాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సదరు ఎంబసీకి నిప్పుపెట్టారు. ఘటనను గమనించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. హింసను ప్రేరేపిస్తే హింసే దక్కుతుందంటూ వీడియోకు క్యాప్షన్ ను సైతం జత చేశారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వార్తలనూ జోడించారు. మరో వైపు దాడిపై ట్వీట్ల వర్షం కురిపిస్తూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.