అమెరికాలో ఘోరం.. భార్య సవాల్ చేసిందని మద్యం మత్తులో తుపాకీతో కాల్చిన జడ్జి
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోరం జరిగింది.తాగిన మత్తులో ఓ న్యాయమూర్తి తన భార్యపైనే కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తాను రేపు న్యాయస్థానానికి రావట్లేదని కోర్టుకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మంగళవారం స్థానిక న్యాయస్థానంలో విచారణ చేపట్టారు. ఆరెంజ్ కౌంటీలోని ఉన్నత న్యాయస్థానంలో జడ్జిగా పనిచేస్తున్న 72 ఏళ్ల జెఫ్రీ ఫెర్గ్యుసన్ ఆగస్ట్ 3న భార్యతో కలిసి అనహైమ్ లోని ఓ రెస్టారెంట్కు వెళ్లారు. డిన్నర్ చేస్తున్న క్రమంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తన చేతినే తుపాకీగా మలిచి భార్యను బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం ఇంటికి చేరుకున్నాక ఆయన భార్య షెరిల్ (65) ఏదీ నిజమైన గన్నును నాపైకి గురిపెట్టు అంటూ సవాల్ విసిరింది.
మంగళవారం బెయిల్పై విడుదలైన జడ్జి
మద్యం మత్తులో తూలుతున్న జెఫ్రీ తుపాకీతో భార్య ఛాతిపై కాల్చాడంతో ఆమె కుప్పకూలింది. ఈ క్రమంలోనే జడ్జి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన తరలివచ్చిన పోలీసులు ఘటనపై ఆరా తీశారు. అంతకుముందే ఆయన అత్యవసర నెంబర్ కి ఫోన్ చేయడంతో ఓ వ్యక్తి వారి నివాసానికి వచ్చాడు. ఆమెను మీరే కాల్చారా అని అడగగా, వాటికి ఇప్పుడు సమాధానాలు చెప్పలేనన్నారు. ఈ మేరకు న్యాయమూర్తి ఇంట్లో రకరకాల గన్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక కావాలనే హత్య చేశారా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది అన్నారు. అయితే మంగళవారం కోర్టు, జడ్జిని బెయిల్పై విడుదల చేసింది. అక్టోబర్ 30న మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.