
Muhammad Yunus: అవి పూర్తయిన తర్వాత.. బంగ్లాదేశ్ ఎన్నికల షెడ్యూల్: మహమ్మద్ యూనస్
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయంగా అనిశ్చితి నెలకొన్న బంగ్లాదేశ్లో మళ్లీ నిరసనలు ముదురుతున్నాయి.
దేశంలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మహమ్మద్ యూనస్ తాజాగా స్పందించారు.
తమ దేశంలో పార్లమెంటరీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్యలో ఏ సమయంలోనైనా జరగొచ్చని స్పష్టంచేశారు.
ప్రస్తుతం పలు సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోందని, అవి పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు.
జపాన్ రాజధాని టోక్యోలో ఏర్పాటు చేసిన ఒక ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
రిజర్వేషన్ల వ్యవస్థపై చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి
గత సంవత్సరం విద్యార్థులు రిజర్వేషన్ల వ్యవస్థపై చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి.
ఈ ఘటనల్లో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అదుపుతప్పడంతో, అప్పట్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆందోళనలు తీవ్రమవడంతో ఆమె దేశాన్ని విడిచి భారత్కి వచ్చి ఆశ్రయం పొందారు.
హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది.
ప్రస్తుతానికి మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని కొనసాగిస్తోంది.