ఐరాసలోనూ కెనడాది పాతపాటే.. భారత పాత్రపై విశ్వాసనీయ సమాచారం ఉందన్న జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా తొలిసారిగా ఆరోపణలు చేసిన ఆయన, తాజాగా ఐరాసలో రెండోసారి అదే పాటపాడారు. ఇప్పటికే భారత్పై ఆయన చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దుమారం రేపుతోంది. ఖలీస్థాన్ అనుకూలవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్, కెనడాల మధ్య దౌత్య యుద్ధానికి దారి తీసింది. తాజాగా, ఐక్యరాజ్యసమితిలో కెనడా ప్రధాన మంత్రి మరోసారి భారత ఏజెంట్ల పాత్రపై తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు. చట్టబద్ధమైన అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు కెనడా కట్టుబడి ఉందని, ఈ మేరకు తమ దర్యాప్తునకు భారత్ సహకరించాలన్నారు.
భారత్ ప్రాధాన్యత పెంచుకుంటున్న దేశం : ట్రూడో
గత సోమవారం పార్లమెంట్లో నేను మాట్లాడినట్లుగా కెనడా గడ్డపై పౌరుడి హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని వాదించేందుకు విశ్వసనీయ కారణాలున్నాయన్నారు. ఇది అత్యంత కీలకమైన వ్యవహారమని, ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. అంతర్జాతీయంగా భారత్ ప్రాధాన్యత పెంచుకుంటున్న దేశమని చెప్పడంలో సందేహమే లేదన్నారు. కానీ కెనడా పౌరుల రక్షణలో రాజీపడబోమని, తమది చట్టబద్ధ పాలన అని, అంతర్జాతీయంగా చట్టబద్ధ సంబంధాల కోసం కృషి చేస్తామన్నారు. భారత్తో తాము కలిసి పనిచేయాల్సి ఉందని, అందుకే దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
ఆ సమయంలోనే మోదీతో చర్చించా : కెనడా ప్రధాని
ఈ అంశంపై G-20 సమయంలోనే మోదీతో చర్చించానని ప్రధాని ట్రూడో చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ, మోదీ ముందు ఈ ఆరోపణలను ట్రూడో లేవనెత్తగా, ఆయన వాటిని తిరస్కరించారన్నారు. మరోవైపు నిజ్జర్ హత్య కేసులో భారతదేశానికి మద్దతుగా కెనడాలోని భారత అధికారులు, భారత దౌత్యవేత్తలకు సంబంధించిన కీలక సమాచారం ఉందని కెనడా అధికారి ఒకరు తెలిపారు. ఇండియవ్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల్లో కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలతో పాటు భారతీయ అధికారులు పాల్గొన్నట్లు తమ వద్ద విశ్వాసనీయ సమాచారం ఉందని కెనడియన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కెనడాతో పాటు యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు కలిగి ఉన్న ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి ద్వారా సమాచారం అందిందని విదేశీ అధికారులు అంటుండటం గమనార్హం.