LOADING...
China Foreign Minister India Visit : సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత్ పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి
సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత్ పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి

China Foreign Minister India Visit : సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత్ పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై నిరంతరం ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అయితే ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి, సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020లో గాల్వన్ లోయ ఘర్షణల తరువాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తరహా పరిస్థితుల్లో వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అవ్వడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Details

సోమవారం షెడ్యూల్ 

సోమవారం సాయంత్రం 4.15 గంటలకు వాంగ్ యీ ఢిల్లీలో దిగనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు జైశంకర్ అధికారిక నివాసంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య సమావేశం జరగనుంది. ఈ భేటీలో మూడు ముఖ్యాంశాలు చర్చించనున్నట్లు సమాచారం: 1. సరిహద్దు వివాదాల పరిష్కారం 2. వాణిజ్య సంబంధాల విస్తరణ 3. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనిక దళాల ఉపసంహరణ, ఉద్రిక్తతలను తగ్గించడం ఈ చర్చల ప్రధాన ఎజెండాగా నిలిచే అవకాశం ఉంది.

Details

లడఖ్ ఉద్రిక్తతలు 

తూర్పు లడఖ్‌లో భారత-చైనా సైనికుల మోహరింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గాల్వన్ ఘర్షణల తర్వాత దౌత్య, సైనిక స్థాయిలో అనేక రౌండ్ల చర్చలు జరగడం వల్ల కొన్ని ప్రాంతాల నుంచి దళాల ఉపసంహరణ జరిగిందిగానీ, కొన్ని క్లిష్ట ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న వాంగ్ యీ-జైశంకర్ సమావేశం ద్వారా ఒక దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. వాణిజ్య లోటు అంశం సరిహద్దు వివాదాలతో పాటు, భారత్-చైనా మధ్య ఉన్న భారీ వాణిజ్య లోటు కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా నిలవనుంది.

Details

మంగళవారం కార్యక్రమాలు 

సోమవారం జైశంకర్‌తో భేటీ ముగించుకున్న తర్వాత, మంగళవారం ఉదయం 11 గంటలకు వాంగ్ యీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కూడా ప్రధానంగా సరిహద్దు సమస్యలపైనే దృష్టి సారించనుంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీని వాంగ్ యీ కలవనున్నారు. సమావేశ ప్రాధాన్యత ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ(SCO)వార్షిక శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే కొన్ని రోజుల ముందే ఈ భేటీ జరగనుండటం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆగస్టు 29న జపాన్ పర్యటన ముగించుకున్న మోదీ, అనంతరం ఉత్తర చైనా నగరం టియంజిన్‌లో జరిగే SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.