భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిడ్నీలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మాస్టర్చెఫ్, క్రికెట్ భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని ఏకం చేశాయని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. తాను 2014లో ఇక్కడికి వచ్చినప్పుడు, భారత ప్రధాని కోసం ప్రవాసులు 28 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదని వాగ్ధానం ఇచ్చానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన మాట కోసమే తాను మరోసారి సిడ్నీకి వచ్చినట్లు ప్రధాని మోదీ అన్నారు.
భారత్-ఆస్ట్రేలియాల బంధం అతీతమైనది: మోదీ
రెండు దేశాల మధ్య సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ, ఇంతకుముందు, భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాలు 3సీ(కామన్వెల్త్, క్రికెట్, కర్రీల) ద్వారా బలపడ్డాయని చెప్పారు. ఆ తర్వాత 3డీ(డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ) ద్వారా మరింత దగ్గరైనట్లు వెల్లడించారు. అనంతరం 3ఈ( ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్)పై మన సంబంధం ఆధారపడి ఉందని మోదీ చెప్పారు. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య బంధం వీటికి అతీతమైనది అని తాను నమ్ముతున్నట్లు మోదీ చెప్పారు. ఇది పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. బ్రిస్బేన్లో త్వరలో భారత కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత, ఇరువురు నేతలు సెల్ఫీల కోసం జనం గుమిగూడారు.
భారతదేశంలో అతిపెద్ద యంగెస్ట్ టాలెంట్ ఫ్యాక్టరీ
ప్రధాని మోదీ భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రశంసించారు. ఐఎంఎఫ్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా పరిగణిస్తోందన్నారు. గ్లోబల్ హెడ్విండ్లను ఎవరైనా సవాలు చేస్తున్నారంటే అది భారతదేశమే అని ప్రపంచ బ్యాంక్ నమ్ముతుందని స్పష్టం చేశారు. భారతదేశంలో సామర్థ్యం, వనరుల కొరత లేదన్నారు. ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద యంగెస్ట్ టాలెంట్ ఫ్యాక్టరీ ఉందని మోదీ పేర్కొన్నారు. క్రికెట్లో భారత్- ఆస్ట్రేలియా బంధం 75 ఏళ్లకు చేరుకుందని చెప్పారు. అయితే ఇరుదేశాల స్నేహం మైదానం వెలుపల కూడా చాలా లోతైనదన్నారు. గ్రేట్ షేన్ వార్న్ మరణించినప్పుడు వందలాది మంది భారతీయులు కూడా సంతాపం వ్యక్తం చేశారన్నారు. తమకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కోల్పోయినట్లు భావిస్తున్నామన్నారు.