Page Loader
Pahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో 
ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో

Pahalgam Terror Attack:'ఇది రహస్యం అని నేను అనుకోను': ఉగ్రవాదులతో ఇస్లామాబాద్ సంబంధాలు నిజమే కానీ.. అంగీకరించిన బిలావల్ భుట్టో 

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత్‌పై విమర్శలు చేస్తూ వస్తోన్న పాకిస్థాన్, కొన్ని సందర్భాల్లో మాత్రం అసలు నిజాలు బయటపెడుతోంది. తాజాగా, పాక్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) మాట్లాడుతూ పాకిస్తాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా అంగీకరించారు. ఇటీవలే ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) కూడా ఇదే విషయాన్ని ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భుట్టో కూడా మీడియా సమావేశంలో అలాంటి వ్యాఖ్యలే చేశారు.

వివరాలు 

అనుభవాలనుండి మేం పాఠాలు నేర్చుకున్నాం

"రక్షణ మంత్రి పేర్కొన్నట్లే, గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా.. వాటి కారణంగా దేశంగా మేము నష్టపోయాం. చాలా తీవ్రంగా దెబ్బతిన్నాం. ఆ అనుభవాలనుండి మేం పాఠాలు నేర్చుకున్నాం.ఇప్పుడు మేము అంతర్గతంగా సంస్కరణలు చేపట్టాం. తీవ్రవాద చరిత్ర పాక్‌దే అనేది సత్యం, దాన్ని ఖండించలేం.కానీ అది గతంలో జరిగిన ఓ దురదృష్ట ఘటన. అది ఒక ముగిసిన అధ్యాయం," అని వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో... "పాకిస్తాన్‌ అనేక ఏళ్లుగా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి?" అని జర్నలిస్టు ప్రశ్నించారు.

వివరాలు 

దేశానికి గొప్ప స్థానం లభించేది

"మేము ఈ రకమైన కార్యక్రమాలను అమెరికా, బ్రిటన్‌ వంటి పశ్చిమ దేశాల కోసమే ముప్పై సంవత్సరాలుగా కొనసాగించాం. కానీ అది పెద్ద తప్పు అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆ చర్యల వల్ల పాకిస్తాన్‌కు చాలా నష్టం జరిగింది. మేము సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొనకపోయి ఉంటే, దేశానికి గొప్ప స్థానం లభించేది," అని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో ఆయన 'లష్కరే తోయిబా' గురించి మాట్లాడుతూ, అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికిలేదని అన్నారు.

వివరాలు 

భారత్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠినమైన నిర్ణయాలు

పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సంస్థల అంచనా ప్రకారం ఈ దాడికి 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (The Resistance Front) అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌కు చెందిన 'లష్కరే తోయిబా' అనుబంధ సంస్థ. భారత ప్రభుత్వం ఇప్పటికే దీనిని ఉగ్ర సంస్థగా గుర్తించి నిషేధించింది. ఈ ఘటన అనంతరం భారత్ ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) అమలు నిలిపివేయడం ఒక ముఖ్య నిర్ణయం.

వివరాలు 

సింధూ నదిలో నీరు ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుంది

దీనిపై స్పందించిన పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వ్యాఖ్యలు మరోసారి వివాదంగా మారాయి. సింధూ నదిలో నీరు ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుంది అంటూ ఆయన భారతదేశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు అసలైన సంరక్షకులు తామేనని పేర్కొన్నారు.