టెక్సాస్లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు
అమెరికా టెక్సాస్లోని అలెన్లో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రద్దీగా ఉండే మాల్లో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఆ దుండగుడు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో తొమ్మిది మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మాల్ వెలుపల కాల్పులు జరిగిన దుండగుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. టెక్సాస్లో మాస్ ఫైరింగ్ ఘటన ఈ వారంలో ఇది రెండోది కావడం గమనార్హం. ఇంతకుముందు ఒక వ్యక్తి తన పొరుగింటిలో ఐదుగురిని చంపి పరారయ్యాడు.
తుపాకీ కాల్పులను తీవ్రంగా ఖండించిన టెక్సాస్ గవర్నర్
తాజా తుపాకీ కాల్పులు వందలాది మంది దుకాణదారులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. తుపాకీ కాల్పుల భయానికి వారు మాల్ నుంచి పారిపోయారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిచారు. దీన్ని చెప్పలేని విషాదంగా అభివర్ణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఒంటరిగానే వచ్చాడని, అయితే అతను ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం తెలియదని పోలీసులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక తుపాకీ హింస అమెరికాలోనే జరుగుతుంది. స్థూల అంచనాల ప్రకారం, తుపాకీ హింస ద్వారా అమెరికాలో 2021లో 49,000 మరణాలు సంభవించాయి. అంతకుముందు సంవత్సరం 45,000 మంది మరణించారు. గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం, 2023లో అమెరికాలో ఇప్పటివరకు 195 కంటే ఎక్కువ సామూహిక కాల్పుల సంఘటనలు జరిగాయి.