'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్
దాయాది దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ముకశ్మీర్పై మరోసారి దాని అక్కసును వెల్లగక్కింది. అయితే పాక్కు భారత్ అదేస్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్ తన ప్రసంగంలో జమ్ముకశ్మీర్ సమస్యను లేవనెత్తారు. దీంతో భారత ప్రతినిధి పాకిస్థాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మొదట తన దేశాన్ని చక్కబెట్టుకోవాలని యూఎన్జీఏ 2వ కమిటీకి ఐక్యరాజ్యసమితిలో మొదటి సెక్రటరీ అయిన పెటల్ గహ్లోట్ చురకలు అంటించారు. పాకిస్థాన్లో మైనార్డీలు, క్రైస్తవులు, మహిళలపై పెద్ద ఎత్తున హింస జరుగుతోదన్నారు.
జమ్ముకశ్మీర్లోని కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగం: పెటల్ గహ్లోట్
భారత్కు వ్యతిరేకంగా నిరాధారమైన, దురుద్దేశపూరితమైన వ్యాఖ్యలు చేయడం పాకిస్థాన్కు అలవాటుగా మారిందని పెటల్ గహ్లోట్ తీవ్రస్థాయిలో మండిప్డడారు. పాకిస్థాన్లో మానవ హక్కులు హరించుకుపోతున్నాయని, ఆ దేశ గణాంకాలే చెబుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలో అధ్వాన్నమైన రికార్డును సొంతం చేసుకున్న ఘనత పాకిస్థాన్కే దక్కుతుందని చెప్పుకొచ్చారు. జమ్ముకశ్మీర్లోని కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని ఆమె నొక్కి చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత్లో అంతర్గతమన్నారు. తమ దేశీయ విషయాలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్కు ఎటువంటి అధికారం లేదు పాకిస్థాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పీఓకేను ఖాళీ చేయండి: పెటల్ గహ్లోట్
దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే, పాకిస్థాన్ కీలక చర్యలు తీసుకోవాలని పెటల్ గహ్లోట్ చెప్పుకొచ్చారు. ముందుగా సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని సూచించారు. ఉగ్రవాద సంస్థలకు మౌలిక సదుపాయాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న భారత భూభాగాల(పీఓకే) ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. పాకిస్థాన్లోని మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను అరికట్టాలని పాక్కు గుర్తు చేశారు. 2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలకు నిలయంగా మారిందని పెటల్ గహ్లోట్ ఆరోపించారు.