Page Loader
TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు
టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ..ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రయత్నాలు

TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలంటూ.. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధుల బృందం ప్రయత్నాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ హృదయవిదారక సంఘటనకు తామే కారణమని 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (TRF) అనే లష్కరే తయ్యిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ స్వయంగా ప్రకటించుకున్నట్లు భద్రతా అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో TRFను అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చించాలని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో (ఐరాస) తక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు న్యూయార్క్‌లో ఉన్న భారత ప్రతినిధుల బృందం యూఎన్ ఆంక్షల పర్యవేక్షణ బృందం, ఇతర దేశాల యూఎన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. అంతేకాకుండా, యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్‌ అధికారులతో కూడా సమావేశమైంది.

వివరాలు 

TRF సంస్థకు సుప్రీం కమాండర్‌గా షేక్ సాజిద్ గుల్

TRF అనే ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తయ్యిబా ఉగ్రసంస్థ అనుబంధంగా 2019 అక్టోబర్‌లో ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దైన అనంతరం ఈ సంస్థ ఉద్భవించింది. షేక్ సాజిద్ గుల్ ఈ సంస్థకు సుప్రీం కమాండర్‌గా ఉన్నాడు. బాసిత్ అహ్మద్ దార్ ప్రధాన ఆపరేషనల్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మొదట్లో హిజ్బుల్ ముజాహిదీన్,లష్కరే తయ్యిబా సభ్యుల సమాహారంతో ఈ సంస్థ ఏర్పడినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న TRFను భారత కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించి, 2023 జనవరి 6న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు 

బైసరన్ లోయలో ఉగ్రదాడి 

యువతను ఉగ్రవాదానికి ఆకర్షించేందుకు ఈ సంస్థ ఆన్‌లైన్ ద్వారా ప్రచారం నిర్వహిస్తోందని, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటుందని పేర్కొంది. అంతేకాక, సామాజిక మాధ్యమాల ద్వారా జమ్మూకశ్మీర్ యువతను భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని, ప్రజలు, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతోందని హెచ్చరించింది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో భయంకరమైన మానవహానీ చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు పర్యాటకులను దగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.