
Donald Trump: మోదీ గొప్ప నాయకుడు.. కానీ భారత్పై అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గొప్ప నాయకుడని ప్రశంసించినప్పటికీ, ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదని తెలిపారు. ట్రంప్ ఇటీవల ట్రూత్ సోషల్లో భారత్, రష్యాలకు దూరమయ్యామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా, భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటోందని, తాను ఆపమని చెప్పినా వెనక్కి తగ్గలేదని అన్నారు. దాంతో భారత దిగుమతులపై భారీగా టారిఫ్లు విధించానని, తన విధించిన 50 శాతం సుంకాలు చాలా ఎక్కువేనని అంగీకరించారు.
Details
ప్రస్తుతం మోదీ చేస్తున్నది నచ్చడం లేదు
ప్రధాని మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధమా?" అని విలేకరి అడగగా, కచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడూ అదే కోరుకుంటా. ప్రధాని మోదీతో ఎల్లప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధాని. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్-అమెరికా మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది, దీనిపై ఆందోళన అవసరం లేదని సమాధానమిచ్చారు. ఇటీవల మోదీ అమెరికా పర్యటనను కూడా ఆయన గుర్తుచేశారు.
Details
చైనా ప్రభావంతో ముందుకెళ్తున్నాయి
అంతకుముందు ట్రంప్ భారత్, రష్యాలను అమెరికా కోల్పోయిందని, అవి చైనా ప్రభావంలోకి వెళ్తున్నాయని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్లతో ఉన్న ఫొటోను పంచుకుంటూ, ఆ మూడు దేశాలు సుసంపన్నమైన భవిష్యత్తు సాధించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రష్యా, ఉత్తర కొరియాలతో కలిసి చైనా అమెరికాపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
Details
జీ20 సమ్మిట్ గోల్ఫ్ రిసార్ట్లో
2026 జీ20 శిఖరాగ్ర సదస్సును మియామిలోని తన సొంత గోల్ఫ్ రిసార్ట్లో నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సమ్మిట్ వచ్చే ఏడాది డిసెంబరులో జరగనుంది. అలాగే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ను 'డిపార్ట్మెంట్ ఆఫ్ వార్' (Department of War)గా మార్చే ఉత్తర్వుపై కూడా ఆయన సంతకం చేశారు.