
Georgia: ఆహారం లేదు,వాష్రూమ్ లేదు: జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన
ఈ వార్తాకథనం ఏంటి
జార్జియాకు సరైన వీసా, అన్ని పత్రాలతో వెళ్లిన భారతీయులపై అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఒక భారతీయ మహిళ ఆరోపించింది. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తే, అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధ్రువీ పటేల్ అనే మహిళ ఈ పోస్ట్ పెట్టారు. అర్మేనియాలోని సడఖ్ సరిహద్దు ద్వారా జార్జియాకు వెళ్తున్న 56 మంది భారతీయులను అక్కడి అధికారులు ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. అధికారులు వారిని 5 గంటలపాటు గడ్డ కట్టే చలిలో ఉంచారన్నారు. ఆ సమయంలో వారికి ఆహారం కూడా ఇవ్వలేదని, కనీసం టాయిలెట్ ను ఉపయోగించేందుకు కూడా అనుమతించలేదని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
భారతీయులపై జార్జియా అధికారుల ప్రవర్తన సిగ్గుచేటు
అంతేకాక, వారిని రెండు గంటలపాటు పాస్పోర్ట్లతో ఫుట్పాత్పై కూర్చోబెట్టారని, జంతువుల్లా ప్రవర్తించారని ధ్రువీ తెలిపారు. అలాగే, నేరస్తుల్లా వారి వీడియోలు తీసారని, కానీ, అధికారులు ప్రవర్తించిన తీరుపై వీడియో తీస్తున్న తమను అడ్డుకున్నట్లు వివరించారు. పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే, వీసాలు తప్పుగా ఉన్నాయి అని చెప్పారని ఆమె వివరించారు. భారతీయులపై జార్జియా అధికారుల ప్రవర్తన సిగ్గుచేటని, అంగీకరించలేనిదని ఆమె ఆవేదనతో పేర్కొన్నారు. ఈ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్లను ట్యాగ్ చేశారు. భారత్ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వివరాలు
ఇంకా స్పందించని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ఈ సమస్య చాలా కాలంగా ఉందని, జార్జియాలో ఇలాంటి సమస్యలపై పోస్టులు గతంలో కూడా ఉన్నాయని ఒకరు పేర్కొన్నారు. జార్జియాలో భారతీయుల పట్ల ఇలాంటి ప్రవర్తన ఉన్నప్పటికీ.. ఇంకా మనపౌరులు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని మరోకరు ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు.