Bangladesh: బంగ్లాదేశ్లో ఆగని విధ్వంసం.. ప్రభుత్వానికి ఆందోళనకారుల హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై ఆందోళనకారుల దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
దేశంలోని 24 జిల్లాల్లో 'బంగబంధు' ముజిబుర్ రెహమాన్ చిత్రాలను తొలగించారు.
ప్రస్తుతం భారత్లో ఉన్న షేక్ హసీనా బుధవారం రాత్రి పార్టీ నేతలతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసంగించిన తర్వాత అల్లర్లు మూడో రోజుకూ కొనసాగుతున్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఢాకాలోని బనానీ ప్రాంతంలో అవామీలీగ్ అధ్యక్ష మండలి సభ్యుడు షేక్ సలీం ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు.
పలుచోట్ల ఇళ్లను దోచుకుని, అనంతరం తగలబెట్టే సంఘటనలు జరుగుతున్నాయి.
Details
విధ్వంసాన్ని ఆపండి.. బంగ్లా ప్రభుత్వం
ఆందోళనకారులు విధ్వంసాన్ని నిలిపివేసి, చట్టాన్ని గౌరవించి దేశంలో శాంతిని పునరుద్ధరించాలని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మహ్మద్ యూనస్ నేతృత్వంలో శుక్రవారం విజ్ఞప్తి చేసింది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఇలాంటి చర్యలను ఖండించడంతో పాటు, ఆస్తులపై దాడులు ఆపాలని కోరుతున్నామని పేర్కొంది.
దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోవడానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని యూనస్ ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోతే దేశ స్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుందని, ఈ పరిస్థితిని నిరంకుశ శక్తులు ఆసరాగా తీసుకోవచ్చని మాజీ ప్రధాని ఖలేదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హెచ్చరించింది.
Details
బంగ్లాదేశీలను వెనక్కు పంపండి
జమ్మూలో శుక్రవారం శివసేన ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో, అక్రమ వలసదారులను వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాగే, భారత్ కూడా అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలను వెంటనే వెనక్కు పంపాలని శివసేన కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేశారు.