LOADING...
Putin- Modi: ప్రధాని మోదీకి పుతిన్ కి ఎందుకు ధన్యవాదాలు తెలిపారు?
ప్రధాని మోదీకి పుతిన్ కి ఎందుకు ధన్యవాదాలు తెలిపారు?

Putin- Modi: ప్రధాని మోదీకి పుతిన్ కి ఎందుకు ధన్యవాదాలు తెలిపారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నాయకులు తీసుకుంటున్న ప్రయత్నాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ యుద్ధాన్ని నిలిపివేయడానికి ట్రంప్, మోదీలు "నోబెల్ మిషన్" చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలున్న నేపథ్యంలో, రష్యా ఈ అంశంపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. అయితే, విరమణకు ముందు ముఖ్యమైన షరతులపై స్పష్టత రావాలని అన్నారు.

వివరాలు 

శాశ్వత పరిష్కారానికే ప్రాధాన్యం 

2024 జూలైలో సమర్పించిన ప్రతిపాదనల మేరకు, తాత్కాలిక పరిష్కారాలను రష్యా అంగీకరించదని పుతిన్ పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రతినిధులు కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాలో ఉక్రెయిన్-రష్యా సంక్షోభ పరిష్కారంపై సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు, వివిధ దేశాధినేతలకు కృతజ్ఞతలు చెప్పాలని పుతిన్ తెలిపారు. ముఖ్యంగా ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

వివరాలు 

ప్రపంచ నేతల సహకారానికి పుతిన్ ధన్యవాదాలు 

యుద్ధ పరిష్కారానికి ప్రపంచంలోని పలు దేశాధినేతలు కృషి చేస్తున్నారని పుతిన్ పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధానమంత్రి, బ్రెజిల్ అధ్యక్షుడు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ సమస్య పరిష్కారానికి తమ సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిపారు. శాంతి సాధనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడటం, ప్రపంచ స్థాయిలో శాంతిని నెలకొల్పడం నాయకుల బాధ్యత అని పుతిన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక శాంతి నెలకొనే అవకాశముంటేనే ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

వివరాలు 

భారత ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ పలు మార్లు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో చర్చలు జరిపారు. గత నెలలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తోనూ ఈ అంశంపై మోదీ సమావేశమయ్యారు. భారత్ ఈ సమస్యలో తటస్థ వైఖరిని పాటిస్తోందని స్పష్టం చేశారు. "ఇది యుద్ధం జరిపే యుగం కాదు" అని మోదీ వ్యాఖ్యానించగా, ట్రంప్ తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తున్నట్లు తెలియజేశారు.