
Sheikh Hasina: 'అన్నీ నేరాలకూ మూలం ఆమెనే'.. హసీనాపై తీవ్ర ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)పై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగాలు మోపిన విషయం విదితమే. ఈ మేరకు ట్రిబునల్ నేడు కేసులపై విచారణను ప్రారంభించింది. తాత్కాలిక ప్రభుత్వం నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం, హసీనాను ఈ నేరాలన్నింటికీ మూలకేంద్రంగా పేర్కొన్నారు. ఆమెకు గరిష్ఠ శిక్ష విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ చౌదురీ అబ్దుల్లా అల్ మామున్ కూడా సహ నిందితులుగా ఉన్నారు. విద్యార్థుల ఆధ్వర్యంలో గతేడాది జులై-ఆగస్టులో జరిగిన ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించినట్టు, భారీగా నిరసనకారులను చంపడం, హింసించడం వంటి తీవ్రమైన ఆరోపణలు హసీనాపై ఉన్నాయి.
Details
విచారణ కోసం అప్పగించాలి
ఈ మేరకు ప్రాసిక్యూషన్ పక్షం, బాధితుల నుంచి, ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సమర్పిస్తామని వెల్లడించింది. ప్రస్తుతం హసీనా, కమల్ దేశం విడిచి వెళ్లగా, మామున్ మాత్రమే కస్టడీలో ఉన్నారు. ఆయన సాక్షిగా మారేందుకు అంగీకరించినట్లు సమాచారం. హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆమెను విచారణ కోసం అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను అభ్యర్థించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన ఉద్యమాల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవి కోల్పోయారు.అనంతరం నోబెల్ విజేత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. జులై 10న హసీనా, కమల్, మామున్లపై అధికారికంగా అభియోగాలు నమోదయ్యాయి. అంతకుముందు కోర్టు ధిక్కరణ కేసులో హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించారు.