100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని హవాయిలో గత మంగళవారం నుంచి కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటలు భారీ ఎత్తున వ్యాప్తిస్తున్నాయి. మౌయి ద్వీపంలోని లహానియా నగరం మొత్తం కార్చిచ్చు ధాటికి తగలపడిబోతోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 89మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అగ్ని ప్రమాదం అమెరికా 100 ఏళ్ల చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. లహైనా అడవి మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యవసర సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ చారిత్రాత్మక రిసార్ట్ పట్టణంలో మంటలు ఇంత త్వరగా ఎలా వ్యాపించాయో అధికారులు ఆరా తీస్తున్నారు.
మౌయి అడవిలో భారత్ నుంచి పంపిన 150 ఏళ్ల మర్రి చెట్టు
కార్చిచ్చు ధాటికి దగ్ధమైన లహైనా పునరుద్ధరణ కోసం 5.5 బిలియన్ డాలర్లు అవసరం అవుతుందని యూఎస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏజెన్సీ వెల్లడించింది. అగ్నిప్రమాదం ధాటికి 2,200 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయి. మౌయి అడవిలో కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 89కి పెరిగిందని, ఈ సంఖ్య మరింత పెరగొచ్చని రాష్ట్ర గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు. హవాయి ద్వీపం మౌయి అడవిలో భారతదేశం నుంచి పంపిన 150 ఏళ్ల మర్రి చెట్టు ఉంది. అయితే కార్చిచ్చులో ఇంకా ఆ మర్రి చెట్టు కాలిపోలేదని తెలుస్తోంది.