USAID: 2,000 యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు, మానవతా సహాయ నిధులను అందించడంలో కీలకమైన యూఎస్ ఎయిడ్ (USAID) నిధులను అమెరికా ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.
తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ సంస్థకు చెందిన 2 వేల మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
కొంతమంది మాత్రమే మినహాయింపుగా మిగిలిపోగా, వేలాది మంది ఉద్యోగులను బలవంతంగా సెలవులకు పంపించినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్సైట్లోని ఒక నోటీసులో వెల్లడైంది.
ఉద్యోగుల తొలగింపుకు ఫెడరల్ కోర్టు అనుమతి ఇచ్చిన అనంతరం మాత్రమే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేసింది.
వివరాలు
కార్యాలయ భవనంలోకి ప్రవేశించకుండా 600 మంది ఉద్యోగుల అడ్డగింత
ఉద్యోగుల కొందరు ఈ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించగా, యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్ వారి విజ్ఞప్తిని తిరస్కరించారు.
అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా మస్క్ (Elon Musk) నేతృత్వంలోని డోజ్ (DOGE) సంస్థ ఇప్పటికే USAID ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించిన విషయం విదితమే.
తాజా చర్యలతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. USAID ద్వారా వృథా ఖర్చులు విపరీతంగా జరుగుతున్నాయని,ఇది అనవసర నిధుల వినియోగానికి దారి తీస్తుందని మస్క్ గతంలోనే ఆరోపించారు.
ఈ కారణంగా USAID నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ చర్యలలో భాగంగా 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.
వివరాలు
భారత్లో ఎన్నికలకు రూ.182 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణ
అయితే, ఫెడరల్ జడ్జి అమీర్ అలీ గత వారం ఈ నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యులు USAID నిధులను ఆమోదించినప్పటికీ,వాటిని ప్రభుత్వం ఎలా నిలిపివేయగలదో అనే ప్రశ్నపై కోర్టులో వాదనలు జరిగాయి.
అయినప్పటికీ, ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ,USAID ద్వారా భారత్లో ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం పెంచేందుకు రూ.182 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపించారు.
ఇకపై అలాంటి నిధులను రద్దు చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలో అత్యధిక పన్నులు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయని,అలాంటి దేశానికి అమెరికా ఎందుకు సహాయ నిధులు అందించాలనే ప్రశ్నను ట్రంప్ లేవనెత్తారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాదోపవాదాలు నెలకొన్నాయి.