Donald Trump: గాజాను సొంతం చేసుకుంటాం.. పునరుద్ఘాటించిన డొనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే, తమ సహనం తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
హమాస్ విడుదల చేస్తున్న ఇజ్రాయెలీ బందీలను హోలోకాస్ట్ బాధితులతో పోలుస్తూ, వారి పరిస్థితిని చూసినప్పుడల్లా మనసు కదలిపోతుందని అన్నారు.
బందీలు నెలల తరబడి ఆహారం లేకుండా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు కనిపిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ఇలాంటి దృశ్యాలను చూస్తూనే తాము ఎంతకాలం సహనం పాటించగలమో అనుమానంగా ఉందని తెలిపారు.
హమాస్ చేత 491 రోజులు బందీలుగా గడిపి తాజాగా విడుదలైన ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు,ఎల్ షరాబీ (52),ఒహాద్ బెన్ అమి (56), ఓర్ లెవీ.. పూర్తిగా బలహీనంగా కనిపించడంతో,వారి కుటుంబ సభ్యులు, ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
వివరాలు
గాజాను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి: ట్రంప్
బందీలుగా మారే ముందు, తరువాత వారి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ, గాజాను స్వాధీనం చేసుకోవడంపై తమ దృష్టి నిలిపినట్టు తెలిపారు.
గాజా పునర్నిర్మాణ బాధ్యతను ఇతరులకు అప్పగించినప్పటికీ, చివరికి గాజాను తమ అధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని వెల్లడించారు.
హమాస్ తిరిగి బలపడకుండా చూడాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని స్పష్టం చేశారు.
ఏ ప్రత్యామ్నాయం లేకపోవడంతో, పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి ప్రవేశించేందుకు మొగ్గు చూపుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.