Page Loader
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి

వ్రాసిన వారు Stalin
May 10, 2023
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పార్టీ నాయకులు, మద్దతుదారులు ఆందోళకు దిగారు. ఈ క్రమంలో నిరసన హింసకు దారితీయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరు మరణాలు నమోదయ్యాయి. డజన్ల కొద్దీ గాయపడ్డారు. నిరసనకారులు రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం ధ్వంసం చేసిన తర్వాత, లోపలికి ప్రవేశించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఆందోళన కార్యక్రమాలే జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కొన్ని ప్రదేశాల్లో హింసకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

పాకిస్థాన్

దేశవ్యాప్తంగా 144సెక్షన్ విధింపు

పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఇస్లామాబాద్‌ హైకోర్టు ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టును సమర్థించింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. మే 1న రావల్పిండిలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఖాన్‌ను అరెస్టు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన వెంటనే, అతని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు, ఫలితంగా దేశవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.

పాకిస్థాన్

ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి 

ఇస్లామాబాద్‌ హైకోర్టు కాంప్లెక్స్ వెలుపల ఆర్మీ చిహ్నాలను ధ్వంసం చేసిన తర్వాత ఖాన్ మద్దతుదారులు రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేశారు. లాహోర్ కాంట్‌లోని కార్ప్స్ కమాండర్ ఇంట్లోకి చొరబడ్డారు. అతని ఇంటి వెలుపల ఉన్న వస్తువులను తగులబెట్టారు. పోలీసుల బారికేడ్లకు నిప్పంటించారు. పెషావర్‌లోని రేడియో పాకిస్థాన్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. అంతేకాకుండా రోడ్ల వెంబడి పీటీఐ నాయకులు టైర్లను తగులబెట్టారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో సింధు రహదారిని మూసివేశారు. ఉన్నపాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ విమానాల ప్రతిరూపాన్ని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు తగులబెట్టారు. ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని పాఠశాలలను మూసివేశారు.