EPFO 3.0 : ఈపీఎఫ్వో 3.0 మరింత సులభతరం, వేగవంతం
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన సభ్యులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు కీలక చర్యలు చేపడుతోంది. డిజిటల్ సేవలను విస్తరించే దిశగా త్వరలోనే ఈపీఎఫ్ఓ 3.0 అనే నూతన వెర్షన్ను ప్రారంభించనుంది. ఈ వెర్షన్ రూపకల్పన, నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలను ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జూన్ నెలలోనే EPFO 3.0 సేవలు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలు, ఇతర సమస్యల వల్ల కొంత ఆలస్యమైనట్లు సమాచారం. అయితే, కొత్త సేవలు అందుబాటులోకి వస్తే దాదాపు 8 కోట్ల మంది చందాదారులకు అనేక సౌకర్యాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే:
వివరాలు
ఏటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణ
భవిష్యనిధి సభ్యులు ఇకపై తమ పీఎఫ్ మొత్తాన్ని బ్యాంకు ఖాతా నుండి డబ్బు తీసుకున్నట్లుగానే ఏటీఎం ద్వారా నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు.
దీనికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్తో పాటు ఆధార్ను తమ బ్యాంకు ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుంది.
అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఈ సౌకర్యం ఉపయోగపడనుంది.
యూపీఐ ద్వారా విత్డ్రా
EPFO 3.0లో మరో ముఖ్యమైన ఫీచర్ యూపీఐ (UPI) ద్వారా నిధులను ఉపసంహరించుకునే అవకాశం. దీని ద్వారా ఎలాంటి పెద్ద ప్రక్రియ లేకుండా, వేగంగా తమ పీఎఫ్ డబ్బును పొందవచ్చు.
వివరాలు
ఆన్లైన్ క్లెయిమ్లు, సవరణలు
ఉద్యోగులు ఇకపై క్లెయిమ్లు లేదా వివరాల సవరణల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఓటీపీ ధృవీకరణ ద్వారా తక్షణమే సవరణలు చేసుకోవచ్చు. అలాగే తమ క్లెయిమ్ స్థితిని ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేయవచ్చు.
మెరుగైన డిజిటల్ అనుభవం
కొత్త వెర్షన్ ద్వారా సభ్యులకు మరింత సులభమైన, వినియోగదారుకు అనుకూలమైన డిజిటల్ అనుభవం లభించనుంది.
పీఎఫ్ ఖాతా స్థితి, చందాలు, ఇతర వివరాలను చందాదారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూడగలరు. ఈ మార్పులు EPFO సేవలను మరింత చేరువ చేస్తాయి.
వివరాలు
వారసులకు వేగవంతమైన సాయం
చందాదారు మరణించిన సందర్భంలో క్లెయిమ్ పరిష్కారం త్వరితగతిన జరిగేలా EPFO కొన్ని కొత్త చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా, మైనర్లకు పింఛను లేదా ఇతర చెల్లింపులు అందించడానికి గార్డియన్షిప్ (సంరక్షణ) సర్టిఫికెట్ అవసరం లేదని ఇటీవల స్పష్టం చేసింది.
గతంలో కొన్ని కార్యాలయాలు ఆ సర్టిఫికెట్ను తప్పనిసరిగా అడుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
దీనివల్ల సంబంధిత కుటుంబాలకు మరింత వేగంగా సాయం చేరుతుంది.