
Airtel Fraud Detection: ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్ డిటెక్షన్' ఫీచర్ అందుబాటులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ (Airtel) సైబర్ మోసాలను అడ్డుకునేందుకు కీలక అడుగు వేసింది.
ఇప్పటికే స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్న ఈ సంస్థ, తాజాగా 'ఫ్రాడ్ డిటెక్షన్' అనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా వాట్సాప్, ఇమెయిల్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చే మోసపూరిత లింక్స్ను గుర్తించి, వాటిని బ్లాక్ చేస్తుంది.
ఈ సదుపాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేస్తుంది. యూజర్లు ఏదైనా లింక్ను క్లిక్ చేసిన వెంటనే, అది మోసానికి గురిచేసే అవకాశం ఉన్నదా అని సిస్టమ్ విశ్లేషిస్తుంది.
ప్రమాదకరమైనదిగా గుర్తిస్తే దాన్ని బ్లాక్ చేస్తుంది. ఒకవేళ సురక్షితమైతే మాత్రమే యూజర్ను వెబ్సైట్కు దారి మళ్లిస్తుంది.
Details
స్పామ్ కాల్స్ గుర్తించే సదుపాయం
ఈ ఫీచర్ మొబైల్ బ్రౌజర్, ఇమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్పై పనిచేస్తుంది.
ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. ప్రస్తుతం హరియాణా సర్కిల్లో ఈ సేవ ప్రారంభమయ్యింది.
త్వరలో దేశవ్యాప్తంగా రోల్ అవుట్ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించే సదుపాయం తరహాలోనే ఇది కూడా పనిచేస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.
ఈ సేవ 10 భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్తో ఎయిర్టెల్ వినియోగదారులకు మరింత భద్రత అందించే దిశగా అడుగుపెట్టినట్లైంది.