Page Loader
Solar Manufacturing: సోలార్ తయారీని పెంచేందుకు $1 బిలియన్ల సబ్సిడీకి భారత్ ప్రణాళిక..!
సోలార్ తయారీని పెంచేందుకు $1 బిలియన్ల సబ్సిడీకి భారత్ ప్రణాళిక..!

Solar Manufacturing: సోలార్ తయారీని పెంచేందుకు $1 బిలియన్ల సబ్సిడీకి భారత్ ప్రణాళిక..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 సోలార్ పవర్ దేశంగా మారేందుకు కృషి చేస్తోంది. ఈ లక్ష్యానికి చేరువగా, సోలార్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో, చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, ప్రపంచ ఇంధన పరివర్తన అవకాశాలను ఉపయోగించుకునే లక్ష్యంతో భారత్ తన సౌర తయారీ రంగాన్ని మరింత బలపర్చాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా, సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి సబ్సిడీ ప్రణాళికను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వివరాలు 

సౌర పరిశ్రమలో బలహీనంగా ఉన్న విభాగాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

ఈ ప్రతిపాదనను పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ రూపొందిస్తుండగా, ముఖ్యంగా వేఫర్లు, ఇంగోట్స్ వంటి సౌర పరిశ్రమలో బలహీనంగా ఉన్న విభాగాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం సహా ఉన్నత స్థాయి సలహాదారుల మద్దతుతో ఈ ప్రణాళిక రూపొందించబడుతుండగా, రాబోయే నెలల్లో దీనిని క్యాబినెట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అయితే, సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

వివరాలు 

వేఫర్లు, ఇంగోట్స్ ఉత్పత్తి కేవలం 2 గిగావాట్ల సామర్థ్యం

ప్రస్తుతం భారత్ తన సౌర పరికరాల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది, ఇది దేశ ఇంధన భద్రతకు ముప్పుగా మారుతుంది. భారతదేశంలో సోలార్ మాడ్యూల్స్, సెల్ తయారీ విభాగాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వేఫర్లు, ఇంగోట్స్ ఉత్పత్తి కేవలం 2 గిగావాట్ల సామర్థ్యంతోనే కొనసాగుతోంది. ఇది అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేయబడింది. బ్లూమ్‌బెర్గ్‌ ఎన్‌ఈఎఫ్ నివేదిక ప్రకారం, భారత్ ప్రస్తుతం 71 గిగావాట్ల మాడ్యూల్ సామర్థ్యంతో పాటు, దాదాపు 11 గిగావాట్ల సెల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వివరాలు 

గణనీయంగా పెరిగిన ఆపిల్ ఫోన్ ఎగుమతులు

భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ రంగంలో అమలు చేసిన ప్రోత్సాహక పథకాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇదే తరహాలో, కొత్తగా ప్రతిపాదిస్తున్న సోలార్ మాన్యుఫాక్చరింగ్ సబ్సీడీ కూడా విజయవంతమవుతుందనే అంచనాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలను ఆకర్షించేందుకు బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను ప్రకటించగా, శాంసంగ్ కూడా భారత్‌లో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ విధంగా, భారత్‌ నుంచి ఆపిల్ ఫోన్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.

వివరాలు 

అల్ట్రా-రిఫైన్డ్ మెటీరియల్స్ భారత్‌ ఉత్పత్తి చేయలేదు 

సౌర పరిశ్రమలో లాజిస్టిక్స్, నాణ్యత నియంత్రణలు, అలాగే వేఫర్లు, ఇంగోట్స్ తయారీకి అధిక వ్యయాలు ప్రధాన సవాళ్లుగా మారతాయి. అయితే, సబ్సిడీలు ఈ వ్యయాలను తగ్గించేందుకు దోహదపడతాయి. అయితే, భారత్ వేఫర్, ఇంగోట్ సామర్థ్యాన్ని పెంచుకున్నా, పాలీసిలికాన్ వంటి కీలక ముడిపదార్థాల కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. బ్లూమ్‌బెర్గ్‌ ఎన్‌ఈఎఫ్ నివేదిక ప్రకారం, అల్ట్రా-రిఫైన్డ్ మెటీరియల్స్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌కు ప్రస్తుతం లేదు. ఈ రంగంలో చైనా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది, సంవత్సరానికి 2.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 75,000 టన్నుల సామర్థ్యంతో జర్మనీ రెండో స్థానంలో ఉంది.