
RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వ్యవస్థలో ద్రవ్యతను పెంచిన సంగతి తెలిసిందే.
తాజాగా మళ్లీ రెపో రేటును తగ్గించే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
జూన్ 6న జరగబోయే ద్రవ్య విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో, రెపో రేటును మరోసారి తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, రెపో రేటును 50 బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ చర్యలు దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే వ్యూహాత్మక చర్యలుగా ఆర్బీఐ చేపట్టబోతోందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
పెరిగిన బ్యాంకుల్లో లిక్విడిటీ పరిమాణం
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం మిగులు ద్రవ్యత పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు.
ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో, ఆర్థిక సంస్థలు తమ సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి.
అంతేకాదు, 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో 30 నుంచి 70 బేసిక్ పాయింట్లవరకు తగ్గింపు చోటుచేసుకుంది.
దీంతో బ్యాంకుల్లో లిక్విడిటీ పరిమాణం మరింత పెరిగింది. ఈ అదనపు లిక్విడిటీని బ్యాంకులు రుణాల రూపంలో వినియోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
వివరాలు
సంవత్సరం చివరి నాటికి.. 100 బేసిక్ పాయింట్ల మేరకు రెపో రేటు తగ్గే అవకాశం
జూన్ నెలలో జరగబోయే ద్రవ్య విధాన సమీక్షలో 50 బేసిక్ పాయింట్ల మేరకు రెపో రేటులో కోత ఉండవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది.
అదే సమయంలో, ఈ సంవత్సరం చివరి నాటికి మొత్తం 100 బేసిక్ పాయింట్ల మేరకు రెపో రేటు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థాయిలు ఆర్బీఐ నిర్దేశించిన పరిమితుల్లోనే కొనసాగుతున్నాయని కూడా ఎస్బీఐ పేర్కొంది.