
Falcon 2000 jets: ఫాల్కన్ 2000 జెట్ విమానాలను తయారు చేయడానికి.. రిలయన్స్ తో డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో కీలక ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు అనిల్ అంబానీకి "ఫెయిలైన వ్యాపారవేత్త" అనే ట్యాగ్ చుట్టుముట్టినప్పటికీ,ఇప్పుడు ఆయన ప్రయాణం లక్షలమంది యువ వ్యాపారవేత్తలకు ప్రేరణగా మారుతోంది.
జీవితంలో కూలిపోవడం సాధారణమే, కానీ ఆ క్షణాల నుంచి తిరిగి ఎలా లేచి నిలదొక్కుకోవాలో అనిల్ అంబానీ జీవితం చెబుతోంది.
ప్రస్తుతం ఆయన తన రెండవ వ్యాపార ఇన్నింగ్స్ ప్రారంభించి, విజయవంతంగా కొత్త ప్రాజెక్టులు చేపడుతూ ముందుకు సాగుతున్నారు.
ఇటీవల అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థ ఒక ప్రముఖ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఫ్రాన్స్కు చెందిన యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్తో రిలయన్స్కు అనుబంధంగా ఉన్న రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
వివరాలు
తొలిసారిగా భారతదేశంలో ఫాల్కన్ విమానాలను అసెంబుల్ చేయనున్నారు
ఈ ఒప్పందం ప్రకారం, డసాల్ట్ సంస్థ తమ ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్లను భారత్లో సంయుక్తంగా ఉత్పత్తి చేయనుంది.
ఈ డీల్ బయటకు వచ్చిన వెంటనే రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ల విలువ 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకింది.
ఈ ఒప్పందంతో డసాల్ట్ సంస్థ ఫాల్కన్ విమానాలను తొలిసారిగా భారతదేశంలో అసెంబుల్ చేయనుంది.
ఇప్పటివరకు ఈ జెట్లు అమెరికా, కెనడా, బ్రెజిల్ వంటి దేశాల్లో తయారవుతుండగా,ఇప్పుడు భారత్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
2028 ముగింపు నాటికి కార్పొరేట్ అవసరాలు మరియు రక్షణ రంగం కోసం "మేడ్ ఇన్ ఇండియా" ఫాల్కన్ 2000 జెట్లను సరఫరా చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
వివరాలు
గత ఏడాది కాలంలో కంపెనీ షేర్ల విలువ 83 శాతం పెరిగింది
రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థ రక్షణ రంగంలో వరుసగా కొత్త ప్రాజెక్టులను చేపట్టుతూ తన వ్యాపార ప్రయాణానికి నూతన దిశను అందిస్తోంది.
ఈ ప్రగతివల్ల గత ఏడాది కాలంలో కంపెనీ షేర్ల విలువ 83 శాతం పెరిగింది.
దీని ఫలితంగా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు దక్కాయి. 2025 ప్రారంభం నుండి ఇప్పటివరకు కంపెనీ షేర్లు 20 శాతానికి మించి పెరిగాయి.
సంస్థ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.421 కాగా, నేటి మార్కెట్ ముగింపు సమయంలో వాటి ధర రూ.386.50 వద్ద నిలిచింది.