
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టి@ 25150
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు,దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు ఏళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గిపోవడం వంటి అంశాలు మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్కు దోహదపడ్డాయి. దీంతో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్ పడింది.అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. ఆటో రంగ సూచీ ఒకటిన్నర శాతం వరకు లాభపడింది. అదే సమయంలో ఫార్మా,హెల్త్కేర్ సూచీలు సుమారు ఒక శాతం పెరిగాయి. సెన్సెక్స్ ఉదయం 82,233.16 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. గత ట్రేడింగ్ ముగింపులో ఇది 82,253.46 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రారంభంలో నష్టాలతో మొదలైనప్పటికీ, తక్కువ సమయంలోనే లాభాల దిశగా మళ్లింది.
వివరాలు
డాలరుతో రూపాయి మారకం విలువ 85.82వద్ద నమోదు
ఇంట్రాడే ట్రేడింగ్లో 82,743.62 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 317.45 పాయింట్ల లాభంతో 82,570.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ కూడా 113.50 పాయింట్ల లాభంతో 25,195.80 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.82 వద్ద నమోదైంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మంచి లాభాలు నమోదుచేశాయి. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 68.99 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,374 డాలర్ల వద్ద కొనసాగుతోంది.