
Stock Market: ఫ్లాట్గా కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు.. ఆర్బీఐ సమీక్ష ముందు మదుపర్ల అప్రమత్తత
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం మిశ్రమ ధోరణితో, ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాలు వెలువడటంతో పాటు,నేడు వెల్లడించనున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల నేపథ్యంలో మదుపర్లు సంయమనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు స్వల్ప లాభాల్లోనే కొనసాగుతున్నాయి.ఉదయం 9:30 గంటల సమయానికి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 76.14 పాయింట్లు పెరిగి 80,786.39 స్థాయికి చేరుకుంది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 11.2 పాయింట్ల లాభంతో 24,660.75 వద్ద ట్రేడ్ అవుతోంది. రూపాయి విలువలో కూడా స్వల్పంగా బలపడింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు మెరుగై 87.72 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
ట్రంప్ వాణిజ్య విధాన వ్యాఖ్యలు - ఆసియా మార్కెట్లపై ప్రభావం
నిఫ్టీలోని కొన్ని ముఖ్యమైన కంపెనీ షేర్లు మదుపర్ల ఆసక్తిని రాబడుతున్నాయి. ముఖ్యంగా శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు, కోల్ ఇండియా,సిప్లా,టెక్ మహీంద్రా,టీసీఎస్,హీరో మోటార్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల ప్రభావంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై 100శాతం దిగుమతి సుంకాల వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. జపాన్ నిక్కీ సూచీ 0.55 శాతం లాభపడగా,ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.57 శాతం లాభాల్లో ఉంది. కానీ దక్షిణ కొరియా కోస్పి 0.03 శాతం,హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 0.23 శాతం మేర నష్టాలను చవిచూస్తున్నాయి.
వివరాలు
నష్టాలతో ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు
మరోవైపు, మంగళవారం ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్ 0.14 శాతం పడిపోయింది. టెక్నాలజీ షేర్ల ఒత్తిడితో నాస్డాక్ 0.65 శాతం క్షీణించగా, ఎస్అండ్పీ 500 సూచీ 0.49 శాతం నష్టపోయింది.