
Stock Market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు మాత్రం ప్రతికూల దిశలో కదులుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత గురువారం సూచీలు బలంగా రాణించాయి. అయితే, నేడు మదుపర్లు లాభాల స్వీకరణ (Profit Booking) వైపు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.35 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 327 పాయింట్లు తగ్గి 82,683 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 85 పాయింట్లు పడిపోయి 25,339 వద్ద కదులుతోంది. విదేశీ మారకంలో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 88.22గా నమోదైంది.
షేర్లు
ఏ షేర్లు ఎలా..?
నిఫ్టీ సూచీలో కొన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్ అండ్ టూబ్రో, హీరో మోటార్కార్ప్ లిమిటెడ్ ఉన్నాయి. అయితే, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హిందాల్కో షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
అదానీ గ్రూప్
అదానీ గ్రూప్పై ప్రభావం
మరోవైపు, అదానీ గ్రూప్కు సంబంధించిన పరిణామాలు మార్కెట్ను కదిలిస్తున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా గౌతమ్ అదానీకి క్లీన్చిట్ ఇచ్చింది. అదానీ కంపెనీలు షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలు జరిగాయని అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని స్పష్టంచేసింది. ఈ పరిణామంతో అదానీ గ్రూప్ షేర్లు జోరందుకున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ సహా పలు అనుబంధ సంస్థల షేర్లు ఒక దశలో 10 శాతం వరకు పెరిగాయి.