Page Loader
US stock market loses: అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి.. 
అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి..

US stock market loses: అమెరికా స్టాక్‌మార్కెట్ల పతనం.. 4 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా స్టాక్ మార్కెట్లు కేవలం 20 రోజుల వ్యవధిలోనే భారీగా పతనమయ్యాయి. ఈ పతనంతో మదుపర్ల సంపద సుమారు 4 ట్రిలియన్‌ డాలర్లు (రూ. 349 లక్షల కోట్లు) మేరకు ఆవిరైపోయింది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), ఫ్రాన్స్ వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ గవర్నమెంట్‌ షట్‌డౌన్ భయాలు అని భావిస్తున్నారు. అదనంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అస్థిర విధానాలు కూడా మార్కెట్లను మరింత ఒత్తిడికి గురి చేశాయి.

వివరాలు 

 10% పడిపోయిన నాస్‌డాక్‌ కాంపోజిట్‌ సూచీ

ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఫిబ్రవరి 19న నమోదు చేసిన ఆల్‌టైమ్ హై స్థాయి నుంచి ఇప్పటివరకు 8% పతనమైంది. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ సూచీ గత డిసెంబర్‌లో సాధించిన గరిష్ట స్థాయి నుంచి 10% పడిపోయింది. కేవలం ఒక్క సోమవారంలోనే 1.7 ట్రిలియన్‌ డాలర్ల సంపద హరించుకుపోయింది. 2022 సెప్టెంబర్ తర్వాత ఇటువంటి స్థాయిలో మార్కెట్లు పడిపోవడం ఇదే తొలిసారి. టెస్లా షేర్లు 15% క్షీణించాయి. డిసెంబర్ 17 నుంచి ఇప్పటివరకు 50% నష్టపోయాయి. ఒకప్పుడు 479.86 డాలర్ల వద్ద ఉన్న టెస్లా షేరు, ఇప్పుడు 222.15 డాలర్లకు పడిపోయింది.

వివరాలు 

సూచీలు ఎందుకు కుంగుతున్నాయి?

వివిధ కారణాలు కలిసి మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య విధానాల్లో మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలు, స్టాక్స్‌ అధిక విలువలు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయని లాజర్డ్‌ సంస్థ సీఈవో పీటర్‌ ఓర్స్‌జాగ్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలతో వాణిజ్య యుద్ధాల కారణంగా అనేక కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయి. ఇది మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతోంది.

వివరాలు 

మార్కెట్ పతనం ఎలా ప్రభావితం చేస్తోంది?

అమెరికాలో సంపద పంపిణీ విధానం అసమతుల్యంగా ఉంది. 50% సంపద కేవలం 1% మంది దగ్గరే ఉంది. 37% సంపద 10% మంది దగ్గరే ఉంది. 12% సంపద 40% మందికి మాత్రమే ఉంది. మిగిలిన 1% సంపద 50% మంది ప్రజలకు ఉందని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయీస్‌ డేటా పేర్కొంది.

వివరాలు 

ఆర్థిక మాంద్యం భయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం దేశం మార్పు దశలో ఉందని పేర్కొన్నారు. అయితే, ఆర్థిక మాంద్యం రాదని ఖచ్చితంగా చెప్పలేదు. యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తాను అలాంటి విషయాలను ఊహించడాన్ని కూడా ఇష్టపడనని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చాలా పెద్దపని చేపట్టింది, అందువల్ల కొన్ని మార్పులు సహజమేనని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పాటు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న అంచనాల ప్రకారం, ట్రంప్ సర్కారు మార్కెట్ పతనాన్ని, ఆర్థిక మాంద్యాన్ని ముందుగా అంచనా వేసిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, వచ్చే 12 నెలల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడానికి 15-20% అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

వివరాలు 

శ్వేతసౌధం ఏమంటోంది?

ఓవైపు మార్కెట్లు పతనం అవుతున్నా, ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగానే ఉందని శ్వేతసౌధంలోని ది నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ అధిపతి కెవిన్ హస్సెట్ట్ చెప్పారు. ఆర్థిక మాంద్యం భయాలను ఆయన తోసిపుచ్చారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పడానికి పలు కారణాలున్నాయి అని పేర్కొన్నారు. అంతేకాకుండా, సుంకాల (టారిఫ్) సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, పన్ను కోతలు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి అనే నమ్మకంతో ఉన్నామని శ్వేతసౌధం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మదుపర్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై తీసుకోనున్న నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నిర్ణయం మార్కెట్లకు ఊరటనిస్తుందా లేదా అనేదానిపై పెట్టుబడిదారులు అంచనాలు వేస్తున్నారు.