US presidential race: కమలా హారిస్ ప్రచారంలో 'నాటు నాటు'సాంగ్
అమెరికా (USA)లో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు విశేష కృషి చేస్తున్నారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ (Kamala Harris) ఈ ప్రచారంలో 'నాటునాటు' పాటను ప్రస్తావనకు తీసుకురావడం విశేషం. ఈ పాట ద్వారా భారత్కు ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. దీనికి ప్రేరణగా భారతీయ అమెరికన్ నేత అజయ్ భుటోరియా 'నాచో నాచో' అనే హిందీ పాటను విడుదల చేశారు. ఇది హారిస్ ప్రచార కార్యక్రమ చిత్రాల సమాహారంగా రూపొందించబడింది.
4.4 మిలియన్ల ఇండియన్ అమెరికన్ ఓటర్ల మద్దతు
'''నాచో నాచో' పాట మాత్రమే కాదు, అది ఒక ఉద్యమం. దక్షిణాసియా అమెరికన్ సమాజంతో అనుసంధానం కావడమే మా లక్ష్యం. 4.4 మిలియన్ల ఇండియన్ అమెరికన్ ఓటర్లు, 6 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2024లో కమలా హారిస్ను విజయపథాన నడిపించేలా వారి మద్దతును కూడగట్టడమే మా ధ్యేయం. 2020లో దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్ వంశంలో మొదటి మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాం. ఇప్పుడు ఆమెను తదుపరి అధ్యక్షురాలిగా చూడటానికి సమయం ఆసన్నమైంది'' అని అజయ్ పేర్కొన్నారు.
రేపు డొనాల్డ్ ట్రంప్,హారిస్ మధ్య తొలి డిబేట్
కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికలో గెలిస్తే, 248ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలుస్తారు. సెప్టెంబర్ 10న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్,హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది.సర్వేలు చూస్తే, ఇద్దరి మధ్య పోటీ ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ప్రారంభంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు. కానీ,ఆయన ఆరోగ్య పరిస్థితులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన బైడెన్-ట్రంప్ డిబేట్ ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. ఆచర్చలో ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ,ట్రంప్దే పైచేయిగా భావించారు. 81 ఏళ్ల బైడెన్ అనేకసార్లు తడబాటుకు గురయ్యారు.అందువల్ల,బైడెన్ రేసు నుంచి తప్పుకోవడంతో కమలాకు అవకాశాలు మెరుగుపడ్డాయి.డెమోక్రాట్ల మద్దతుతో ఆమె అధ్యక్ష రేసులో ముందుకు సాగుతున్నారు.