Raviteja: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు నిడివి ఎక్కువ కారణంగా మొదట డివైడ్ టాక్ వచ్చింది. తర్వాత నిడివి తగ్గించడంతో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో నుపూర్సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. ఇక రేణుదేశాయ్, అనుపమ్ఖేర్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అప్డేట్ లేకుండా ఈ మూవీ ఓటీటీలోకి రావడంతో రవితేజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
నెల రోజులు పూర్తికాకుండానే ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు
స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా సినిమా రిలీజ్ అనంతరం చాలా మంది ఓటీటీలో రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ఇందులోనే ఈ చిత్రం ఇవాళ నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నెల రోజులు పూర్తి కాకుండానే అప్పుడే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.