
#NewsBytesExplainer: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? సినీ ఛాంబర్ ఎందుకు మౌనం వహిస్తోంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.
మొదటిగా, వచ్చే నెలలో 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమవుతోంది.త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
ఆ తర్వాత సెప్టెంబర్ 25న 'ఓజీ' థియేటర్లలోకి రానుంది. అయితే ఈ రెండు సినిమాలకు సోలో రిలీజ్ అవకాశం దక్కడం లేదు.
ఆ తేదీల్లో ఇతర చిత్రాలు కూడా థియేటర్లలోకి వస్తుండటంతో విడుదలలో ఢీ తప్పదన్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో పవన్ అభిమానులతో పాటు కొంతమంది సినీ వర్గాల వారు "ఇలాంటి విషయాల్లో సినిమా ఛాంబర్ ఎందుకు మౌనంగా ఉంది?" అంటూ ప్రశ్నిస్తున్నారు.
వివరాలు
హరిహర వీరమల్లు vs కింగ్డమ్ - ఓటీటీ పోటీ కారణమా?
'హరిహర వీరమల్లు' కొత్త విడుదల తేదీ జూలై 25గా భావిస్తున్నారు.ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ రోజు థియేటర్లలోకి రావడం గ్యారెంటీ.
ఇదే తేదీన విజయ్ దేవరకొండ హీరోగా,గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'కింగ్డమ్' అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
మొదట్లో ఈ సినిమా జూలై 4న విడుదల కావాల్సి ఉంది.కానీ చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదు,పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉన్నాయి.
ఈ కారణంగా విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నారు.ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే - 'హరిహర వీరమల్లు' ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది.
'కింగ్డమ్'ఓటీటీ హక్కులు పొందిన నెట్ ఫ్లిక్స్ మాత్రం జూలై 4 కాకపోతే కనీసం జూలై 25నైనా విడుదల చేయాలని ఒత్తిడి తెస్తోందట.
వివరాలు
ఓజీ vs అఖండ 2 - అదే తేదీకి రెండు భారీ సినిమాలు!
అమెజాన్ ప్రైమ్కి పోటిగా తన సినిమా రావాలని నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుండటం వల్లే ఈ విడుదల తేదీపై ఒత్తిడిగా భావిస్తున్నారు.
విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా విడుదల కాబోతోంది.
ఇదే రోజున నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2 తాండవం' కూడా థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలున్నప్పటికీ... బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్లో మాత్రం సెప్టెంబర్ 25నే రిలీజ్ అని స్పష్టంగా పేర్కొన్నారు.
దీంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
వివరాలు
ఛాంబర్ మౌనంపై ప్రశ్నలు... వివక్షేకారణమా ?
పండుగ సందర్భాల్లో..సంక్రాంతి,క్రిస్మస్ లాంటి వేళల్లో.. ఈ రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదల కావడం అలవాటే.
కానీ సాధారణ రోజుల్లో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల అయితే, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో ఛాంబర్ ప్రకటనలు చేసింది.
కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చూసుకోవాలని అప్పట్లో సూచించింది.
అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఛాంబర్ ఎందుకు మౌనంగా ఉంది? అని కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు.
పండుగల సమయంలోనూ రెండు సినిమాల మధ్య రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటే గానీ విడుదల జరగకుండా జాగ్రత్త పడతారు.
వివరాలు
థియేటర్లపై పోటీ పెరిగి.. కలెక్షన్లపై ప్రభావం
కానీ ఇప్పుడేమో అదే రోజున విడుదలలు ప్లాన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
థియేటర్లపై పోటీ పెరిగి, రెండు సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఫిలిం ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో కీలకంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఛాంబర్ పదవుల్లో ఉన్నారు.
వీరి సినిమాలప్పుడు మాత్రం వీళ్ళకు అనుకూలంగా - అంటే వారం గ్యాప్ వంటి నియమాలు అమలవుతాయని, మిగతా సినిమాల విషయంలో మాత్రం ఆ నియమాల్ని విస్మరిస్తారని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వివరాలు
వాట్సాప్ గ్రూప్ వివాదం - పవన్కు సమాచారం
డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వాట్సాప్ గ్రూపుల్లో 'హరిహర వీరమల్లు' సినిమా విషయమై కొందరు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి చేరినట్లు ప్రముఖ నిర్మాత 'బన్నీ' వాసు తెలిపారు.
ఈ పరిణామంపై పవన్ స్పందించిన తర్వాత, పావులు కదిపిన వారంతా మౌనంగా ఉండడం గమనార్హం.
ఇప్పుడు ఆయన సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేయడంలో కూడా అదే వ్యక్తుల ప్రమేయముందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అందరికీ సహాయం చేయాలనే దృక్పథంతో ఉంటే... అదే పవన్ సినిమాలకు వ్యతిరేకంగా కొందరు పావులు కలపడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం.