
CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ను నిలిపివేసే వ్యవధిని తగ్గించేందుకు, పోలీసులు 'వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్'అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని పరీక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు వాహన శ్రేణికి ప్రత్యేకంగా ట్రాఫిక్ను ఆపవద్దని ఆదేశించడంతో,ఉన్నత పోలీసు అధికారులు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి,ప్రకాశం బ్యారేజీ గుండా విజయవాడ నగరం మీదుగా గన్నవరం విమానాశ్రయం వరకూ ఉన్న ప్రధాన రూట్ పై రెండు వైపులా మొత్తం 36 ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కృత్రిమ మేధ(AI)ఆధారంగా పనిచేస్తాయి.ఈకెమెరాలను విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేశారు,తద్వారా ప్రత్యక్షంగా ట్రాఫిక్పై నిఘా పెట్టడం సాధ్యమవుతోంది.
వివరాలు
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా..
కొండవీటి వాగు వద్ద ఏర్పాటు చేసిన తొలి కెమెరా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT)సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది. సీఎం వాహన శ్రేణికి ముందు ఉండే ముందస్తు వాహనం అక్కడికి చేరగానే,ఈ కెమెరా జీపీఎస్ ద్వారా గుర్తించి,దృశ్యాలను వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు పంపుతుంది. ఆ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని,తర్వాతి మూడు కీలక ప్రాంతాల వద్ద ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. అంతేకాకుండా, ప్రతి ట్రాఫిక్ పాయింట్ వద్ద ఎంతసేపు ట్రాఫిక్ నిలిపివేయబడిందో ఈకెమెరాలు స్వయంచాలకంగా లెక్కించి, ఆ డేటాను సర్వర్కు పంపించే విధంగా డిజైన్ చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటివచ్చే కూడలి అయిన కేసరపల్లి జంక్షన్ వద్ద కూడా ఇదే విధమైన IoT ఆధారిత కెమెరా అమర్చారు.
వివరాలు
గరిష్ఠంగా 5 నిమిషాలే..!
గత రెండు నెలలుగా పోలీసులు ఈ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కృత్రిమ మేధా ప్రోగ్రామ్ను అభివృద్ధి చేశారు. తొలుత సీఎం ప్రయాణించే మార్గాల్లో సగటున 10 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేస్తుండేవారు. అయితే, ఈ కొత్త వ్యవస్థను ప్రయోగంలోకి తీసుకువచ్చిన తర్వాత, ఆ వ్యవధి గరిష్ఠంగా 5 నిమిషాలకు తగ్గింది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఫీల్డ్ పరీక్షలు పూర్తయిన తర్వాత, ఈ సాంకేతిక విధానాన్ని అధికారికంగా అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.