LOADING...
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో 5 పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్  
'ఆపరేషన్ సిందూర్' సమయంలో 5 పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్

Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో 5 పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చేశాం:ఐఏఎఫ్ చీఫ్  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' పాకిస్థాన్‌పై గట్టి ప్రభావం చూపింది. ఈ మెరుపు దాడుల్లో మన దళాలు శత్రువుకు చెందిన అనేక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. తాజాగా ఈ ఆపరేషన్‌పై వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏ.పీ. సింగ్‌ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం, ఈ దాడుల సమయంలో పాకిస్థాన్‌ వాయుసేనకు చెందిన కనీసం ఐదు యుద్ధవిమానాలను మన బలగాలు కూల్చివేశాయి. పాకిస్థాన్‌ వైమానిక శక్తికి కలిగిన ఈ నష్టంపై భారత్‌ అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి.

వివరాలు 

80-90 గంటల్లోనే మా లక్ష్యాల్లో చాలావరకు సాధించాం: ఏ.పీ. సింగ్‌

బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏ.పీ. సింగ్‌ 'ఆపరేషన్‌ సిందూర్‌'కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "పూర్తి ప్రణాళికతో ఈ ఆపరేషన్‌ను అమలు చేశాం. ఇది అత్యాధునిక సాంకేతికతతో జరిగిన యుద్ధం. కేవలం 80 నుంచి 90 గంటల వ్యవధిలోనే మేము నిర్ణయించిన లక్ష్యాల్లో ఎక్కువ భాగాన్ని చేరుకున్నాం. యుద్ధం ఇలాగే కొనసాగితే పాకిస్థాన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారికి స్పష్టమైంది. అందుకే వారు చర్చలకు ముందుకు వచ్చారు. ఆ ప్రతిపాదనను మేము అంగీకరించాం" అని వివరించారు.

వివరాలు 

మన సైన్యం దాడితో సగానికి పైగా దెబ్బతిన ఎఫ్‌-16 హ్యాంగర్‌

"ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధవిమానాలను కూల్చివేశాం. అదనంగా ఒక పెద్ద రవాణా విమానాన్ని కూడా ధ్వంసం చేశాం. మన బలగాలు దాడి చేసిన ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్‌-జకోబాబాద్‌ కేంద్రం ఒకటి. అక్కడ ఎఫ్-16 యుద్ధవిమానాల కోసం హ్యాంగర్‌ ఉంది. మన దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అక్కడ నిల్వలో ఉన్న కొన్ని యుద్ధవిమానాలు కూడా తీవ్రంగా నష్టపోయాయని మేము అంచనా వేస్తున్నాం. ఈ ఆపరేషన్‌లో మన గగనతల రక్షణ వ్యవస్థ మరియు ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి" అని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏ.పీ. సింగ్‌ వివరించారు.