ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ
ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజకీయ నాయకుల కోసం అరెస్టు, రిమాండ్, బెయిల్ను నియంత్రించే మార్గదర్శకాలు రూపొందించలేమని ధర్మానసం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలను కేంద్రం ఏకపక్షంగా ఉపయోగించుకుంటోందని నిర్దిష్ట కేసును ఉదహరించాలని పిటిషనర్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడానికి నిరాకరించడంతో ప్రతిపక్షాలు తమ పిటిషన్ను ఉపసంహరించుకున్నాయి.
మార్చి 24న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నట్లు కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, టీఎంసీ సహా 14 పార్టీలు మార్చి 24న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని పిటిషన్ దాఖలు చేసిన రోజు అభిషేక్ సింఘ్వీ కోరారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ, ఈడీ కేసుల సంఖ్య పెరగడాన్ని సింఘ్వి ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను ఏప్రిల్ 5న విచారణకు అంగీకరించింది. ఈ క్రమంలో బుధవారం పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.