Delhi services bill: లోక్సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా
మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు. దిల్లీలో సేవల నియంత్రణపై వివాదాస్పద ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తోంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీకి సంబంధించి ఏదైనా చట్టాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం పార్లమెంటుకు అన్ని హక్కులు ఇచ్చినట్లు అమిత్ షా గుర్తు చేశారు. దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై బీజేడీ కేంద్రానికి మద్దతు ఇచ్చింది. బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా మాట్లాడుతూ.. దిల్లీ విషయంలో పార్లమెంటు ఏదైనా చట్టాన్ని రూపొందించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని ఆయన అన్నారు.