Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..బాండ్స్ జారీ తక్షణమే నిలిపేయాలి..సుప్రీం సంచలన తీర్పు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)ప్రకారం అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ,ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 15) ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తీర్పును వెలువరించింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని జారీ చేసే బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2019లో స్కీమ్ మధ్యంతర ఉత్తర్వు నుండి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్వీకరించిన అన్ని ఎలక్టోరల్ బాండ్ విరాళాల వివరణాత్మక రికార్డులను భారత ఎన్నికల కమిషన్ (ECI)కి అందించాలని సుప్రీం కోర్టు SBIని ఆదేశించింది.
నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదు
ECI మూడు వారాల్లో SBI నుండి సమగ్ర డేటాను అందుకుంటుంది. సమాచారాన్ని సేకరించిన తర్వాత, ఈ వివరాలను తన అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని, సమాచారానికి పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు ఈసీఐని ఆదేశించింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది.