Page Loader
Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ 
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ

Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో,సోషల్ మీడియాలో నకిలీ వార్తలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నకిలీ సమాచారం కొన్ని సందర్భాల్లో ప్రజల్లో భయం,ఆందోళన కలిగించేలా మారుతోంది. యుద్ధ భయాల నడుమ,ఓ సందేశం వాట్సాప్‌ వేదికగా విస్తృతంగా షేర్ అవుతోంది. అందులో ర్యాన్సమ్‌వేర్ తరహాలో సైబర్ దాడి జరిగే అవకాశముందని,అందుకే దేశవ్యాప్తంగా రెండు నుంచి మూడు రోజులు ఏటీఎంల సేవలు నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయం పట్ల ప్రభుత్వం స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)లో భాగమైన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తను పూర్తిగా ఖండించింది.

వివరాలు 

వీడియోల పట్ల స్పష్టత

ఈ సందేశం పూర్తిగా నకిలీదని, దేశవ్యాప్తంగా ఏటీఎంలు ఎప్పటిలాగే పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు, భయాందోళనలు కలిగించే సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వాటిని షేర్ చేయకూడదని పీఐబీ విజ్ఞప్తి చేసింది. ఈ ప్రచారానికి "ఆపరేషన్ సిందూర్" నేపథ్యం ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా ఉన్న కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు, గుజరాత్‌లోని ఓ పోర్టు పై దాడి, అలాగే పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో డ్రోన్‌ లేదా క్షిపణి దాడులకు సంబంధించిన వీడియోలని షేర్ చేశారు. వీటిని గమనించిన భారత ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆ వీడియోల పట్ల స్పష్టత ఇచ్చింది.

వివరాలు 

ఆయిల్ ట్యాంకర్ పేలుడు సంభవించిన దృశ్యాలు 

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, గుజరాత్‌లోని హజీరా పోర్టుపై దాడి జరిగిందని చెబుతున్న వీడియో అసలైనదికాదని తేలింది. ఆ వీడియో 2021లో ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడు సంభవించిన దృశ్యాలకు సంబంధించినదని వెల్లడించింది. అలాగే, జలంధర్‌లో డ్రోన్ దాడి జరిగిందని చెబుతున్న మరో వీడియో వాస్తవానికి ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించినదని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి సమాచారాన్ని నమ్మకుండానే, అధికారిక వేదికల నుంచి నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే నమ్మాలని పీఐబీ సూచించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ