BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్బర్గ్లో 15వ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరారు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రధానమంత్రి తను బయలుదేరే ముందు పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ సౌత్కు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి బ్రిక్స్ వేదికగా మారనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్ కూటమి వివిధ రంగాలలో బలమైన సహకార ఎజెండాను అనుసరిస్తోందని మోదీ చెప్పారు. సహకార రంగాలను గుర్తించడానికి, సంస్థాగత అభివృద్ధిని సమీక్షించడానికి బ్రిక్స్ సదస్సు మంచి అవకాశమని వివరించారు.
25వ తేదీన గ్రీస్కు వెళ్లనున్న మోదీ
బ్రిక్స్ సదస్సు సందర్భంగా తాను కొందరు ప్రముఖులతో సమావేశం కానున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను జోహన్నెస్బర్గ్లో ఉన్న సమయంలో బ్రిక్స్-ఆఫ్రికా ఔట్రీచ్, బ్రిక్స్ ప్లస్ డైలాగ్ ఈవెంట్లో కూడా తాను పాల్గొంటానని చెప్పారు. జోహన్నెస్బర్గ్లో కొంతమంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని మోదీ వివరించారు. బ్రిక్స్ సదస్సు అనంతరం ప్రధాని మోదీ గ్రీస్ వెళ్లనున్నారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు తాను 25వ తేదీన ఏథెన్స్కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. దీంతో 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని గ్రీస్కు వెళ్లడం ఇదే తొలిసారి.