Page Loader
Parliament budget session: నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం

Parliament budget session: నేటి నుంచే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఇవి ఆరంభమవుతాయి. అనంతరం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో నివేదిక సమర్పిస్తారు. శనివారం, ఆమె కేంద్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సమర్పించనుండటం విశేషంగా నిలుస్తుంది.

వివరాలు 

 ఈసారి సభకు పెండింగ్‌లో ఉన్న మరో 10 బిల్లులు ..

ఈ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది. వీటిలో వక్ఫ్, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లులు ఉన్నాయి. వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ నివేదికను గురువారం స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. దీంతో, ఈ సమావేశాల్లోనే దీన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. కేంద్రం ప్రవేశపెట్టనున్న ఇతర ముఖ్యమైన బిల్లులలో 'ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్,' త్రిభువన్ శాకరీ యూనివర్సిటీ, బ్యాంకింగ్, రైల్వేస్, విపత్తు నిర్వహణ, ఆయిల్ ఫీల్డ్స్, 2025 ఫైనాన్స్ బిల్లు ఉన్నాయి. గత సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న మరో 10 బిల్లులు కూడా ఈసారి సభకు రానున్నాయి.

వివరాలు 

ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం 

ఈ సమావేశాల్లో విపక్షాలు పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి. మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటరీ కమిటీల పనితీరుపై విపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి చెందిన సభ్యులే ఎక్కువగా కమిటీలలో ఉండటంతో అవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని విపక్షాలు ఆరోపించాయి.

వివరాలు 

బీహార్‌కు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ

'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అంశంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించాలని భాజపా మిత్రపక్షం జేడీయూ అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయపడింది. బీహార్‌కు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ ఇవ్వాలని ఎల్జేపీ విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా, సభలో సీట్ల మార్పు, మాట్లాడే సమయాన్ని పెంచాలని జేడీయూ, టీడీపీ, ఎల్జేపీ పార్టీల ప్రతినిధులు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.