Page Loader
Mock Drill: దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్‌ డ్రిల్‌.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం
దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్‌ డ్రిల్‌.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం

Mock Drill: దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్‌ డ్రిల్‌.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి పాల్పడినవారికి, కుట్రలో పాల్గొన్నవారికి చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోందా? పాకిస్తాన్‌పై భారీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో కేంద్రం యుద్ధ స్థితిని తలపించి అప్రమత్తత ప్రకటించడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. ఈ నేపథ్యంలో,గగనతల దాడులకు హెచ్చరించే సైరన్లను అమలు చేయాలని,ప్రజలకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. మే 7న (బుధవారం)మాక్‌డ్రిల్ నిర్వహించాలని పేర్కొంది.

వివరాలు 

పౌర రక్షణ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి 

ఈ డ్రిల్లులో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువ కేంద్రాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొననున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలి? వారికి ఎలాంటి సూచనలు ఇవ్వాలి? వైమానిక దాడుల సమయంలో ఎలా వ్యవహరించాలి? అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు. కీలక పరిశ్రమలు, వ్యవస్థలను గుర్తించకుండా దాచడం, ప్రజలను తక్షణమే తరలించే మార్గాలపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బంకర్లు, కందకాలను శుభ్రపరచాలని సూచనలిచ్చారు. పౌర రక్షణ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నది కేంద్ర ఉద్దేశ్యం. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ అణు బాంబు బెదిరింపుతో హస్తకల్పిత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. క్షిపణి పరీక్షలతో భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది.

వివరాలు 

పాక్‌పై వ్యూహాత్మక చర్యలు - నీటిపై ఆంక్షలు, ఆర్థిక బంద్‌కు ప్రయత్నాలు 

ప్రస్తుతం పాక్‌పై భారత్ కఠినంగా స్పందించే అవకాశం ఉన్న నేపథ్యంలో హోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తోంది. హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్లను పరిశీలించాలనీ, కంట్రోల్ రూమ్ పనితీరును సమీక్షించాలని ఆదేశించింది. త్రివిధ దళాధికారులు ఇప్పటికే ప్రధాని మోదీని కలిశారు. రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. కేవలం రక్షణ పరంగానే కాకుండా పాకిస్థాన్‌ను ఆర్థికంగా కూడా ఒత్తిడిలో పెట్టేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. మొదటగా సింధు నదీజలాల పంపిణీని ఆపిన భారత్, తర్వాత బగలిహార్, తాజాగా సలాల్ జలాశయాల్లో నుంచి నీటి విడుదలను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.

వివరాలు 

ప్రధాని మోదీకి పుతిన్  ఫోన్

ఇది సరిపోదని భావించిన కేంద్రం, ఆసియా అభివృద్ధి బ్యాంకును (ADB) సంప్రదించి, పాకిస్థాన్‌కు నిధుల సప్లైను నిలిపేయాలని విజ్ఞప్తి చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఉగ్రవాదంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జపాన్‌ కూడా భారత్‌కు మద్దతు తెలిపింది. కానీ చైనా మాత్రం పాక్‌కు మద్దతుగా నిలుస్తూ యుద్ధం పరిష్కారం కాదని, సంయమనం పాటించాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి కూడా ఇలాంటి ప్రకటనే విడుదల చేసింది.

వివరాలు 

జలవిద్యుత్ ప్రాజెక్టులకు వేగం 

పహల్గాం దాడి తర్వాత భారత్ స్వల్పంగా స్పందిస్తూ కీలక చర్యలు ప్రారంభించింది. బగలిహార్, సలాల్ ప్రాజెక్టుల్లో తొలిసారి పూడికతీత చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లోని ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధు ఒప్పందం నిలిపివేయడంతో ఇప్పుడు పాకిస్థాన్‌కు జలసంపదపై ఆధారపడే అవకాశాన్ని భారత్ తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర జల సంఘం మాజీ అధిపతి కుష్వీందర్ వోహ్రా ప్రకారం, ఒప్పందం లేకపోవడం వల్ల భారత్‌ తన ప్రాజెక్టుల్లో స్వేచ్ఛగా మార్పులు చేయవచ్చు.

వివరాలు 

ఆర్థికంగానూ అష్ట దిగ్బంధం! 

ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు మసాటో కాందుతో ఇటలీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిన పాకిస్థాన్‌కు నిధుల కేటాయింపును తగ్గించాలని ఆమె కోరినట్టు సమాచారం. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వార్తలను తర్వాత తోసిపుచ్చింది.

వివరాలు 

పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం

పాకిస్థాన్ మరోసారి క్షిపణి ప్రయోగానికి తెగబడ్డది. "ఇండస్" వ్యాయామంలో భాగంగా ఈ ప్రయోగం జరిగింది. భూమి మీద నుంచే ప్రయోగించిన ఈ క్షిపణి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తాకగలదు. ఈ ప్రయోగం బలగాల సిద్ధతను పరీక్షించేందుకు, వ్యవస్థల పనితీరును ధృవీకరించేందుకు అని పాక్ ప్రకటించింది. పాక్ సైనికాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు వివిధ పార్టీలతో సమావేశమై భారత్ దాడి చేస్తే దీటుగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చినట్లు 'డాన్' పత్రిక తెలిపింది.

వివరాలు 

ఉద్రిక్తతలు చల్లారాలి: ఇరాన్‌ మంత్రి 

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని పాక్ పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆకాంక్షించారు. ఆయన ఇప్పటికే మధ్యవర్తిత్వానికి సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానిని కలిశారు. గురువారం భారత్‌కు రానున్నారు. ఇదే సమయంలో, రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్‌ కూడా పాక్ విదేశాంగ మంత్రి డార్‌తో మాట్లాడి పరిస్థితుల పరిష్కారానికి సహకరించతామన్నారు.

వివరాలు 

ఎల్‌వోసీ వెంబడి సైనిక చర్య! 

భారత్ ఎప్పుడైనా నియంత్రణ రేఖ (LoC) వద్ద సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. దీనికి తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం అణుయుద్ధ ముప్పు తేవడాన్ని ఆయన విమర్శించారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, బలోచిస్తాన్‌లోని ఉగ్రవాదానికి భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. అదే సమయంలో, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్ దాడి చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.