Page Loader
డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 
భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలపై భారత సైన్యం తీవ్ర ఆందోళన

డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 

వ్రాసిన వారు Stalin
Apr 11, 2023
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమో చు లోయ వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి ఆనుకుని ఉంది. ఇది భారతదేశం-చైనా-భూటాన్ డోక్లామ్ ట్రై-జంక్షన్ నుంచి కేవలం కొంత దూరంలో ఉండటం గమనార్హం. డోక్లామ్‌లోని నిర్మాణాలపై ఇండియా టుడే ప్రత్యేకంగా ప్రచురించిన తాజా చిత్రాలను విడుదల చేసింది. అమో చులోని కమ్యూనికేషన్ టవర్‌లతో పాటు సైనికులకు శాశ్వత నివాసాలను చైనా సైన్యం నిర్మిస్తున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది.

చైనా

దేశ భద్రతా ప్రయోజనాలకు ముప్పు: నిపుణులు

చైనా సైన్యం 1,000 శాశ్వత సైనిక నిర్మాణాలు, అనేక తాత్కాలిక షెడ్‌లు ఇటీవల నిర్మించినట్లు ఇండియా టుడే విడుదల చేసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. డోక్లామ్‌లో భారత సైన్యం నుంచి బలమైన ప్రతీకారాన్ని ఎదుర్కొన్న తర్వాత పశ్చిమాన ఉన్న భారత సరిహద్దుపై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది. డోక్లామ్‌కు పశ్చిమాన చైనా నియంత్రణలో ఉన్న భూటాన్ భూభాగంలో కార్యకలాపాలు దేశ భద్రతా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తాయని భారత సైనిక ప్రణాళికదారులు భావిస్తున్నారు. డోక్లామ్ పీఠభూమిపై నియంత్రణ చైనాకు వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుందని భారత నిపుణులు అంటున్నారు.